ర్యాగింగ్కు మరో విద్యార్థి బలి, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య
హైదరాబాద్: ర్యాగింగ్ భూతం మరో విద్యార్థిని బలి తీసుకుంది. సీనియర్ల వేధింపులు భరించలేక వరంగల్ జిల్లా హన్మకొండలో రైలు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి సాయినాథ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. హన్మకొండ వడ్డేపల్లి చెరువు వద్ద రైల్వేట్రాక్పై విద్యార్థి మృతదేహం లభ్యమయింది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద దొరికిన పర్సులో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ర్యాగింగ్ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొన్నాడు. ఆ రోజు సీనియర్లు అలా చేసి ఉండకపోతే, తాను ఇలా చేసేవాడినికాదని పేర్కొన్నాడు. సాయినాథ్ మేడ్చల్లోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన సాయినాథ్ హైదరాబాదులో చదువుతున్నాడు. కాజీపేటలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.
కాగా, సాయినాథ్ ఆత్మహత్య పైన విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కళాశాలలో ర్యాగింగ్ నియంత్రించడంలో యాజమాన్యం విఫలమైందని, సకాలంలో స్పందిస్తే ఆయన ప్రాణాలతో బతికేవాడని మండిపడ్డారు.
ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్
ఆ రోజు సీనియర్లు అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్ అని సాయినాథ్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. కాగా, సాయికృష్ణ చాలా మంచివాడని, అమాయకుడని, అందరితో బాగా మాట్లాడే వారని స్నేహితులు చెబుతున్నారు.