బీజేపీ, నేను వేరు కాదు.: ఆ వార్తల్లో నిజం లేదంటూ రఘునందన్ రావు వివరణ
న్యూఢిల్లీ: తాను బీజేపీ అధిష్టానంకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఆ పార్టీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. పదేళ్లుగా క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు. బీజేపీ తరపున రెండోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలను ప్రసారం చేయవద్దని.. మీడియా ప్రతినిధులకు రఘనందన్ రావు విజ్ఞప్తి చేశారు.
తాను, బీజేపీ.. వేరు వేరు కాదని అన్నారు రఘునందన్. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా నడుచుకోలేదన్నారు. కాగా, 'బీజేపీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా' అని అన్నట్లుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుపై వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీకి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు రఘునందన్.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా? అని.. ఫ్లోర్ లీడర్లో ఏదో ఒకటి ఇవ్వాలని.. జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చినా తనకు ఓకే అన్నట్లు రఘునందన్రావు చెప్పినట్లు వార్తలు ప్రసారం అయ్యాయి. దుబ్బాకలో తనను చూసే ప్రజలు గెలిపించారన్న రఘునందన్... బండి సంజయ్ది స్వయంకృతాపరాదంగా అభివర్ణించినట్లు ప్రసారం అయ్యాయి.
బండి సంజయ్ పదవి మార్పుపై వచ్చే వార్తలన్నీ నిజాలేనని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావన్న ఆయన... రఘునందన్, ఈటల బొమ్మలతోనే ఓట్లు వస్తాయని వ్యాఖ్యానించినట్లు మీడియాలో ప్రసారమయ్యాయి. తాను గెలిచినందుకే ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చారన్న రఘునందన్.. పదేళ్లలో పార్టీ కోసం నాకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదన్నట్లు వార్తలు వచ్చాయి.
సేవకు ప్రతిఫలం లేకుంటే నడ్డాపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ వెల్లడించినట్లు మీడియాలో ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన రఘునందన్.. తాను మీడియాతో అలా మాట్లాడలేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. తాను నియోజకవర్గం నిధుల కోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీని కలిసేందుకే ఢిల్లీకి వచ్చానని రఘునందన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications