టీఆర్ఎస్కూ టీడీపీకి పట్టిన గతే: కేసీఆర్పై రఘునందన్ రావు నిప్పులు, బండి సంజయ్ లేఖ
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్. లక్ష రూపాయల రైతు రుణమాఫీని వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్.. రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి: బండి సంజయ్
వరి పంట వేయొద్దని ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమవాటా సొమ్ము 413 కోట్ల రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి, రైతులను దళారీల నుంచి రక్షించాలన్నారు సంజయ్. రైతులకు పట్టాదార్ పాసు బుక్కులను వెంటనే మంజూరు చేయాలని, ఉచిత యూరియా హామీని అమలు చేయాలన్నారు. రైతులకు అండగా బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

బీఏసీకి ఎందుకు పిలువలేదంటూ రఘునందన్ రావు ఫైర్
మరోవైపు బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీని బీఏసీకి ఆహ్వానించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మజ్లీస్ నేతలు చెప్పినప్పటి నుంచి స్పీకర్ ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రఘునందన్ పైవ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీకి ఆహ్వానించడం లేదు. స్పీకర్ చైర్ అంటే మాకు గౌరవం. కానీ, స్పీకర్ తీరు సరిగా లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి ఏర్పడినపుడు బీజేపీని ఆహ్వానించారు. ఇప్పుడు ఎందుకు ఆహ్వానించడం లేదని అడుగుతే స్పీకర్ వద్ద సరైన సమాధానం లేదన్నారు. శాసనసభ స్పీకర్ అదుపులో నడుస్తున్నట్టు కనిపించడంలేదు. అందుకే స్పీకర్ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. స్పీకర్.. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్నారనే అపవాదును మూటగట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

టీఆర్ఎస్కూ టీడీపీకి పట్టినగతి తప్పదు..
ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే బీఏసీకి ఆహ్వానించవద్దనే నిబంధన ఎక్కడుందో చెప్పాలి. ఐదుగురు సభ్యులు ఉంటేనే బీఏసీకి ఆహ్వానించాలనే నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలి. బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీకి పిలవకపోవడంపై సోమవారం నిరసన తెలియజేస్తామని రఘునందన్ రావు తెలిపారు. సోమవారం రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తాం. గతంలో అమలు పరిచిన విధానాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయాలి. సీఎం కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని, కొత్త విధానాలను అమలు చేస్తే.. టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్కు పడుతుంది.

టీఆర్ఎస్కు కాంగ్రెస్ బీటీం.. కేసీఆర్ నియంతృత్వ పోకడలు వద్దు..
సీఎల్పీని టీఆర్ఎస్ విలీనం చేసుకున్నప్పుడు.. భట్టి విక్రమార్కను మాత్రం బీఏసీకి ఎలా ఆహ్వానిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీజేపీ సభ్యులను బీఏసీకి ఎందుకు ఆహ్వానించడంలేదని భట్టి ప్రశ్నించడం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే అని ఇప్పటికైనా బట్టబయలు అయింది. కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్లో విలీనం అయ్యారు. మిగిలిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు బీ టీంగా మారింది. అందుకే బీజేపీ సభ్యులను బీఏసీకి పిలువకపోయినా భట్టి సైలెంట్గా ఉంటున్నారు. అసెంబ్లీని కేవలం ఐదు రోజులు నడిపిస్తామని బీఏసీ నిర్ణయించడం బాధాకరం. బీఏసీలో టీఆర్ఎస్ చెప్పినదానికల్లా కాంగ్రెస్ తల ఊపుతోంది. అందుకే అధికార పార్టీ అనుకునన్ని రోజులు మాత్రమే అసెంబ్లీని నిర్వహిస్తోందని రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిపైన చర్చించేందుకు శాసనసభ సమావేశాలను నెల రోజులపాటు నిర్వహించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇకనైనా నియంతృత్వ పోకడలకు కేసీఆర్ మంగళంపాడి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications