తెలంగాణలో యాత్రను మర్చిపోలేను, బాధగా ఉంది: రాహుల్ గాంధీ, మహారాష్ట్రలోకి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తెలంగాణ ప్రజల పోరాట పటిమపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో నేటితో ముగిసింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద సోమవారం నిర్వహించిన ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
తెలంగాణను వదిలి వెళ్లడం బాధగా ఉందన్న రాహుల్
భారత్ జోడో యాత్ర.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగుతోందని, ఈ యాత్రలో భాగంగా గత పది రోజులుగా తెలంగాణలో పర్యటించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. నేడు తెలంగాణ నుంచి మహారాష్ట్రలో యాత్ర ప్రవేశిస్తుందన్నారు. తెలంగాణలో ఎంతో మంది ప్రజలతో మాట్లాడానని, వారి కష్టసుఖాలున తెలుసుకున్నట్లు రాహుల్ చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే, ఇప్పుడు వదిలివెళుతుంటే బాధగా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలతో కలిసి ప్రయాణం చేశానంటూ రాహుల్
తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల పనితీరు గొప్పగా ఉందన్నారు రాహుల్. ఇవేవీ మీడియాలో, టీవీలో రావని అన్నారు. పార్టీ కార్యకర్తల పనితీరును తాను స్వయంగా చూశానన్నారు. గతంలో తెలంగాణకు రావడం, సమావేశాలకు హాజరవడం.. తిరిగి వెళ్లిపోవడం.. ఇలా జరిగేది కానీ.. ఈసారి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని ప్రజలతో కలిసి ప్రయాణం చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిశానని, అందరితో మాట్లాడానని చెప్పారు.
మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలపై రాహుల్ విమర్శలు
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని మండిపడ్డారు రాహుల్ గాంధీ.తమ ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనుల కోసం ఎంతో చేసిందన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరి భూములు వారికి దక్కుతాయన్నారు. యాత్రలో భాగంగా అనేకమంది రైతులను కలిసి మాట్లాడానని, అయితే, ఎవరూ కూడా సంతోషంగా ఉన్నామని చెప్పలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తాను భారత్ జోడో యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజల పోరాటంపై రాహుల్ ప్రశంసలు
ఈ యాత్రలో తాను ఎంతగానో నేర్చుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో చేసిన పాదయాత్రను తాను ఎప్పుడూ మర్చిపోలేనని అన్నారు. మోడీ చేసే ప్రతి చట్టానికి పార్లమెంట్లో కేసీఆర్ మద్దతిస్తారని రాహుల్ అన్నారు. మోడీ, కేసీఆర్లు కలిసే పనిచేస్తారన్నారు. మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుంటే.. కేసీఆర్ ప్రాజెక్టుల ద్వారా కమీషన్లు దండుకుంటున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పోరాటం ఆపని ధీరోదత్తులు తెలంగాణ ప్రజలని కొనియాడారు రాహుల్ గాంధీ. తన యాత్రలో పాల్గొనే ఓ బాలుడు పెద్ద సాహసమే చేశాడన్నారు. పలుమార్లు పోలీసులు తోసేసినా.. చివరకు తన వద్దకు చేరుకున్నాడని తెలిపారు.
మరోవైపు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలోని అన్ని సమస్యలు పోతాయన్నారు. గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు.