ఉత్తమ్ పై రాహుల్ ప్రభావం..! గౌరవంగా తప్పుకుని హుందాగా వ్యవహరించాలని సీనియర్ల ఉత్తమ సలహా..!!
హైదరాబాద్: టీపిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సహచరుల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో బలోపేతం అవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం, ప్రత్యర్థి పార్టీ బీజేపి బలోపేతం అవ్వడం కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా వైదొలగాలంటూ సీనియర్ నేతలు పరోక్షంగా ఉత్తమ్ కు సంకేతాలు పంపుతున్నారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరస ఓటములు చవిచూడాల్సి వచ్చిందని, అయితే ఓటమికి నైతిక బాధ్యత కారణం చూపిస్తూ తప్పుకోవాలని హితవు పలుకుతున్నారు నాయకులు. తాజాగా రాహుల్., కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఓటమికి తానే బాధ్యుడినంటూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
రాహుల్ రాజీనామా..! తెలంగాణ పీసీసీపై తీవ్ర పరిణామం..!!
రాహుల్ రాజీనామాతో తాత్కాలికంగా కాంగ్రెస్ అధిష్టానం మోతీలాల్ ఓరాను నియమించింది. తెలంగాణలో సైతం అలాగే తాత్కాలిక అధ్యక్షుడిని నియమించాలన్న డిమాండ్ పార్టీలో ఊపందుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగేళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్వవహరిస్తున్నారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక జరిగిన జీహెచ్ఎంసీతో పాటు ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికే రాహుల్ గాంధీ రాజీనామాకు సంఘీభావంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు రాజీనామా చేశారు. సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయకపోవడం చర్చనీయాంశమైంది.
ఉత్తమ్ తప్పుకోవాలంటున్న సీనియర్లు..! విలువలు పాటించాలని సూచన..!!
అలాగే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ కుటుంబానికి విధేయుడు. రాహుల్ గాంధీకి సన్నిహితుడు. వాస్తవానికి రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగి ఉంటే రాష్ట్రాల పీసీసీల మార్పులో భాగంగా తెలంగాణలోనూ ఛేంజ్ జరిగేదన్న ప్రచారం ఎన్నికల ఫలితాల తర్వాత జరిగింది. ఇప్పుడు రాహుల్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ కూడా పీసీసీల జోలికి ఇప్పుడు వెళ్లే ప్రసక్తి ఉండదు. ఈ నేపథ్యంలో పదవీ వ్యామోహంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం లేదన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. మరి ఉత్తమ్ సీనియర్ నేతల ఒత్తిడికి తలొగ్గుతారో? లేదో? చూడాల్సి ఉంది.
ఇంకా వెయిటింగ్ లోనే కోమటిరెడ్డి..! ఎటూ తేల్చుకోలేక పోతున్న నేత..!!
బీజేపీలో చేరాలనే తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ప్రయత్నాలకు బ్రేకులు పడ్డట్లు సమాచారం. తాము స్పష్టత ఇచ్చే వరకు కాంగ్రెసుకు రాజీనామా చేయవద్దని బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సూచించింది. కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆయన చేరికకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే, వారి నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. దానికి ప్రధాన కారణం వారిద్దరి అభ్యంతరమేనని అంటున్నారు.
పీసిసి పై కన్నేసిన రాజగోపాల్..! అందుకే పునరాలోచన అంటున్న నేతలు..!!
బీజేపీలోకి వెళ్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని అప్పట్లో రాజగోపాల్ రెడ్డి ఓ కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పిన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా రాజగోపాల్ రెడ్డి డిమాండ్లు కూడా ఉన్నాయని అంటున్నారు.ఆయన దూకుడు పార్టీకి నష్టం చేస్తుందని వారు అధిష్టానంతో చెప్పినట్లు సమాచారం. పార్టీ పగ్గాలను తన చేతికి ఇవ్వాలని ఆయన బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అది బీజేపీ నాయకత్వానికి మింగుడు పడడం లేదని అంటున్నారు. అంతే కాకుండా తెలంగాణ పీసిసి పైన కన్నేసిన రాజగోపాల్ ఉత్తమ్ స్థానం ఖాళీ ఐతే ఆ స్థానంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ మారేందుకు వెనకాముందు ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.