తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా: రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. మొదటి రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరఫున రాజాసింగ్ లోధ్, లక్ష్మణ్ తదితరులు నామినేషన్ దాఖలు చేశారు. లోయర్ ట్యాంక్బండ్లోని విజయ గణపతి ఆలయంలో పూజలు చేసిన లక్ష్మణ్ ఆ తర్వాత ముషీరాబాద్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట కేంద్రమంత్రి హన్సరాజ్ తాహిర్, ఎంపీ దత్తాత్రేయ, కిషన్ రెడ్డి ఉన్నారు.
వార్ వన్ సైడేనా?: మహాకూటమి వైపు తాజా జాతీయ సర్వే, టిక్కెట్ల కోసం రచ్చరచ్చ
హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన రాజాసింగ్ గోషామహల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట రామ్ మాధవ్ ఉన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నుంచి మనోహర్ రెడ్డి, పరకాల నుంచి విజయ్ చందర్ రెడ్డిలు బీజేపీ తరఫున నామినేషన్ ఇచ్చారు. గోషామహల్లో రామ్ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజాసింగ్ గెలుపు ఖాయమైంది, మెజార్టీ తేలాలి
గోషా మహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజాసింగ్ లోథ్ గెలుపు ఖాయమైందని, కానీ ఎంత ఎక్కువ మెజార్టీతో గెలుస్తారనేదే తేలాల్సి ఉందని రామ్ మాధవ్ చెప్పారు. అయిదేళ్లుగా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన చేసిన పనులు, ఆయనపడిన శ్రమ కారణంగా ప్రజలు ఆయనకు మద్దతిస్తారని, ఆయన అద్భుత మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడి నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారని చెప్పారు.
బీజేపీ అద్భుత విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా
కేవలం గోషామహల్ నియోజకవర్గంలోనే కాకుండా, మొత్తం తెలంగాణవ్యాప్తంగా బీజేపీ అనూహ్యంగా, బలమైన శక్తిగా ఎదగబోతుందని రామ్ మాధవ్ చెప్పారు. బీజేపీ అద్భుతమైన విజయం సాధించి, ఆశ్చర్యమైన ఫలితాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ముందుకు పోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజాసింగ్కు ఉన్న ప్రజాబలం ముందు ఏదీ పని చేయదు
రాజాసింగ్కు ఉన్న సంపద లక్షలాది మంది యువ కార్యకర్తలు, అభిమానులు అని రామ్ మాధవ్ చెప్పారు. ఇతనికు ఉన్న బలం, అభిమాన ఆస్తి ఇక్కడ ఎవరికీ లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వారికి డబ్బులు ఉండవచ్చునని, వారు ఆ డబ్బులు వెదజల్లవచ్చునని, కానీ అంతగా డబ్బులేని రాజాసింగ్కు ఉన్న ప్రజాబలం ముందు ఏ డబ్బులూ పని చేయవని చెప్పారు. బీజేపీ ఏ విలువలు, ఆశయాలకు కట్టుబడి ఉందో, రాజాసింగ్ కూడా వాటి కోసమే పని చేస్తూ వస్తున్నారని రామ్ మాధవ్ చెప్పారు. అందుకే జాతీయస్థాయి నేతలు ఆయనకు మరోసారి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.
నా నియోజకవర్గంలో వారే పెట్రోల్, భోజనం తెచ్చుకుంటారు
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనకు మరోసారి టిక్కెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని రాజాసింగ్ అన్నారు. ఈ ర్యాలీకి వచ్చిన రామ్ మాధవ్, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు అన్నారు. 2014లో తాను 47వేలకు పైగా ఓట్లతో గెలిచానని, ఈసారి 51వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం ఉందని చెప్పారు. ఇతర పార్టీల వారు డబ్బులతో ప్రజలను తీసుకు వస్తారని, కానీ తన నియోజకవర్గంలో ప్రజలు మాత్రం అందుకు భిన్నమని చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రజలు మాత్రం వారే భోజనం, పెట్రోల్ తెచ్చుకుంటారని, వారి లక్ష్యం తనను గెలిపించడం ఒక్కటే అన్నారు.
అదే నా సిద్ధాంతం
గోరక్షణ, ధర్మరక్షణ తన సిద్ధాంతమని రాజాసింగ్ చెప్పారు. అదే తన సిద్ధాంతం అన్నారు. ప్రజల ఆశీర్వాదం, హిందువుల ఆశీర్వాదం తనకు ఉందని చెప్పారు. వేల కోట్ల సంపద ఉన్న వారు మీతో పోటీ పడుతున్నారని, మీ వద్ద పెద్దగా ఆస్తి లేదని, మరి ఎలా గెలుస్తారని ఓ విలేకరి ప్రశ్నించగా.. రాజాసింగ్ మాట్లాడుతూ.. తన వద్ద ధర్మబలం ఉందని, డబ్బు బలం లేదని, ధర్మబలం గెలుస్తుందని చెప్పారు.