మీకు థ్యాంక్స్.. తెలంగాణకు సహకరిస్తాం: కేసీఆర్కు నితీష్ కుమార్ ఫోన్
హైదరాబాద్/పాట్నా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో ఎన్డీయే తరఫున పోటీ చేసిన తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్కు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిదే గెలుపు: కాంగ్రెస్కు టీడీపీ, ఎన్డీయేకు టీఆర్ఎస్ ఓటు
భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి తమవంతు సాయం చేస్తామని, తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కాగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేసింది. తెలుగుదేశం విపక్షాల కూటమి తరఫున నిలబడిన కాంగ్రెస్ నేత హరిప్రసాద్కు ఓటు వేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్కు దూరం జరిగింది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన హరివంశ్. నితీష్ కుమార్కు అత్యంత సన్నిహితులు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వానికి మరో విజయం దక్కిన విషయం తెలిసిందే. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో అధికార పక్షాల అభ్యర్థి హరివంశ్ 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
గురువారం ఉదయం జరిగిన ఈ ఎన్నికలో హరివంశ్కు 125 ఓట్లు రాగా, ప్రతిపక్షాల అభ్యర్థి, కాంగ్రెస్ నేత హరిప్రసాద్కు 105 ఓట్లు వచ్చాయి. దీంతో కొత్త డిప్యూటీ ఛైర్మన్గా హరివంశ్ పేరును రాజ్యసభ ఛైర్మన్ కయ్య నాయుడు ప్రకటించారు.
రాజ్యసభలో ప్రస్తుతం 244 మంది సభ్యులున్నారు. ఎన్నికకు ఏఏపీ, వైసీపీ సహా 14 మంది సభ్యులు దూరంగా ఉన్నారు. దీంతో సంఖ్యాబలం 230కి తగ్గింది. ఇందులో 125 మంది సభ్యుల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించారు.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల కూటమి బలాన్ని నిరూపించుకునేందుకు ఈ ఎన్నిక కీలకంగా మారింది. ఎన్డీయే అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్, తృణమూల్ సహా ప్రతిపక్షాలన్నీ ఏకతాటి పైకి వచ్చాయి. తొలుత తృణమూల్ లేదా ఎస్పీ అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్షాల కూటమి భావించినప్పటికీ చివరి నిమిషంలో ఆ బాధ్యతను కాంగ్రెస్కు అప్పగించాయి. దీంతో సీనియర్ నేత హరిప్రసాద్ను ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దించింది.
ఇక, బీజేపీ సొంత పార్టీ నుంచి కాకుండా మిత్రపక్షం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపింది. ఎన్డీయే మిత్రపక్షాలు కూడా హరివంశ్కు మద్దతిచ్చేలా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, నితీష్లు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు.