రాంచరణ్ ఫ్యాన్, యూట్యూబ్ సెన్సేషన్ 'బాలధీర' కన్నుమూత
రెండేళ్ల క్రితం మగధీర డైలాగ్ తో యూట్యూబ్ ను షేక్ చేసిన పరుశురామ్ అలియాస్ బాలధీర కన్నుమూశాడు.
గద్వాల: చాంతాడంత పొడవుండే డైలాగ్స్ చెప్పడానికి ఎంతటి స్టార్ అయినా ఒక్కోసారి కెమెరా ముందు తడబడుతంటాడు. కానీ నిండా ఐదేళ్లు కూడా లేని ఓ చిన్నోడు గుక్కతిప్పుకోకుండా ఒక మాస్ డైలాగ్ చెబుతుంటే సోషల్ మీడియాలో జనం 'ఔరా!' అనుకున్నారు.
ఒక్క డైలాగ్ చెప్పడమేనా!.. అంత చిన్న వయసులో.. అచ్చు సినిమాలో హీరో మాదిరి రౌద్రాన్ని తలపించేలా ఆ బుడ్డోడు ప్రదర్శించిన నటన ప్రతీ ఒక్కరిని కదలించింది. చివరకు ఆ డైలాగ్ చెప్పిన స్టార్ సైతం బుడ్డోడి ప్రతిభను చూసి మురిసిపోయి నేరుగా ఆ చిన్నోడిని కలుసుకున్నాడు.

ఇదంతా రెండేళ్ల క్రితం యూట్యూబ్లో పరుశురామ్ అలియాస్ బాలధీరకు కేవలం ఒక్క డైలాగ్ ద్వారా వచ్చిన పాపులారిటీ. కానీ విషాదమేమిటంటే.. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ చిన్నోడు అనారోగ్యం కారణంగా ఇటీవలే కన్నుమూశాడు. కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న పరుశురామ్ వ్యాధి ఎక్కువవడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది.
పరుశురామ్ మరణంతో రామ్ చరణ్ అభిమానులంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. రెండేళ్ల క్రితం హీరో రామ్ చరణ్ పరుశురామ్ ను నేరుగా కలిసి అతని చదువకయ్యే ఖర్చులను కూడా భరిస్తానని అప్పట్లో మాటిచ్చాడు. ఆ సందర్భంగా చాలాసేపు అతనితో ముచ్చటించి.. ఆ చిన్నోడి చెప్పిన డైలాగులకు అబ్బురపడ్డాడు.
కానీ, విషాదం వెక్కిరించడంతో పరుశురామ్ కు పదేళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. సోషల్ మీడియా ద్వారా పరుశురామ్ మరణవార్త బయటకు వచ్చింది. గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో పరుశురామ్ కన్నుమూసినట్లు సమాచారం.అప్పట్లో అతని డైలాగ్ విని అబ్బురపడినవాళ్లంతా ఇప్పుడు బాధాతప్త హృదయాలతో నిట్టూరుస్తున్నారు.












Click it and Unblock the Notifications