కోర్టులో న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ముద్దాయి!
ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. జీవితఖైదు పడిన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రంగారెడ్డి పోక్సో కోర్టు న్యాయమూర్తిపై ముద్దాయి చెప్పు విసిరాడు. పోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో తట్టుకోలేని నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
న్యాయమూర్తిపై చెప్పు విసరడంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణలో కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన కోర్టులోని న్యాయవాదులు నేరస్తుడుని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. దీంతో అతడ్ని అక్కడ్నుంచి తరలించారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాగా, న్యాయమూర్తిపై దాడికి పాల్పడిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
రూ. లక్ష లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారి (ఆర్ఐ).. అవినీతి నిరోధక శాఖ(ACB)కి చిక్కాడు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన కుంభం రాజిరెడ్డి జనవరి నెలలో చనిపోగా.. ఆయనకు చెందిన 3.25 ఎకరాల స్థలాన్ని భార్య సుజాత పేరిట మార్చుకునేందుకు 20 రోజుల కిందట దరఖాస్తు చేశారు.
అయితే, ఈ పని చేసేందుకు దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మన్యం నర్సింహారెడ్డి రూ. లక్ష లంచం డిమాండ్ చేశాడు. దీంతో దరఖాస్తుదారులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తా సమీపంలో టీ పాయింట్ వద్ద డబ్బులు చేతులు మారే క్రమంలో అధికారులు కాపు కాసి పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ క్రమంలో సిద్దిపేటలోని ఆయన నివాసం, దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేశారు.












Click it and Unblock the Notifications