యువకుడ్ని కొట్టి, కారులో యువతిని లాక్కెళ్లి: హైద్రాబాద్లో అర్ధరాత్రి దారుణం
భాగ్యనగర శివారులో కొందరు దుండగులు ఓ యువకుడిని కొట్టి, అతని వెంట ఉన్న యువతిని కారులో అపహరించుకు వెళ్లి అత్యాచారయత్నం చేశారు.
హైదరాబాద్: భాగ్యనగర శివారులో కొందరు దుండగులు ఓ యువకుడిని కొట్టి, అతని వెంట ఉన్న యువతిని కారులో అపహరించుకు వెళ్లి అత్యాచారయత్నం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఆమెను విడిపించడంతో పాటు నిందితులను పన్నెండు గంటల్లో అరెస్టు చేశారు.
బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన యువకుడు తమ దూరపు బంధువు, ఖమ్మంకు చెందిన యువతి(21)ని ఈ నెల ఆరో తేదీన నగరానికి తీసుకు వచ్చాడు. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతోంది.
దీంతో ఆమెను శామీర్పేటలోని తన సోదరుడి ఇంట్లో ఉంచాడు. ఎనిమిదో తేదీన స్థానిక బిస్కట్ పరిశ్రమలో ఉద్యోగానికి ఎంపికైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సోదరుడితో యువకుడికి గొడవ జరిగింది.
బైక్పై బయలుదేరగా..
రాత్రి 12.30 గంటలకు యువతిని మియాపూర్లోని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు బైక్ పైన బయలుదేరాడు. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత బౌరంపేట కూడలి వద్ద ఆగారు. ఆ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
అదే సమయంలో
ఆ సమయంలో మెదక్ జిల్లా బీరంగూడకు చెందిన జోగిందర్ సైనిక్పురిలో ఉంటున్న భార్య వద్దకు కారులో తల్లి, కుమారుడితో పాటు స్నేహితుడైన ఆర్సీపురం వాసి సోహైల్తో కలిసి బయలుదేరాడు. ఆ సమయంలో బౌరంపేట కూడలి వద్ద ఉన్న యువజంటను గమనించాడు.
దుర్మార్గపు ఆలోచన
అది చూసి అతనికి దుర్మార్గపు ఆలోచన వచ్చింది. వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవాలంటూ తల్లిని ఆ దగ్గర ప్రాంతంలో దించాడు. అప్పటికే కొడుకు నిద్రలో ఉన్నాడు. అతను స్నేహితుడు సోహైల్తో కలిసి తన కారును ఆ జంట దగ్గర ఆపాడు.
అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి
యువకుడిపై దాడిచేసి యువతిని కారులో అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన గమనించిన బౌరంపేట వాసి జంగారెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలిని విడిపించారు. సంఘటన స్థలంలోనే జోగిందర్ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఆర్సీపురంలో సోహైల్ను పట్టుకున్నారు.