వారికే చాన్స్, టీ హబ్ ట్రెండ్ సెటర్గా నిలుస్తుంది: రతన్ టాటా
హైదరాబాద్: టీ హబ్ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అన్నారు. టీ హబ్ను ఆయన గురువారం సాయంత్రం హైదరాబాదులో ప్రారంభించారు. సృజనాత్మకంగా ఆలోచించాలని మాత్రమే తాను విద్యార్థులకు ఇచ్చే సందేశమని ఆయన అన్నారు. సృజనాత్మకంగా ఆలోచించే వారికే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
వయసుతో సంబంధం లేకుండా వినూత్నంగా ఆలోచించాలని ఆయన సూచించారు. నవభారత్ నిర్మాణానికి వినూత్నమైన ఆలోచనలు కావాలని ఆయన అన్నారు. ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్లండి అనే నినాదంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్ ప్రారంభోత్సం గచ్చిబౌలిలో జరిగింది. సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు.
తాను టీ హబ్ బిల్డింగ్ను చూసి ఆశ్చర్య పోయానని గవర్నర్ నరసింహన్ అన్నారు. టీ హబ్ రాష్ట్ర భవిష్యత్కు బాటలు వేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉత్తమ ఆలోచనపరులున్నారని అన్నారు. టీ హబ్ సేవలు గ్రామీణ ప్రాంత ఆలోచనపరులకు చేరేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుందని పేర్కొన్నారు. ఐటీతోపాటు కనీస అవసరాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు.
భారత్లో మేధోసంపత్తికి కొదవ లేదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. యువభారత్ ప్రపంచానికి సవాలు విసురుతుందన్నారు. గూగుల్, ఫేస్బుక్ తర్వాత సంచలనం భారత్లోనేనని, అదీ హైదరాబాద్ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ల రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి పునరుద్ఘాటించారు.
టీ హబ్లో జీ+5 ఫ్లోర్లలో దాదాపు 100 స్టార్టప్లు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వారి వారి అవసరాలను బట్టి క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ కేటాయిస్తారు. కెఫ్టేరియా, ఉత్సాహపరిచే రీతిలో ఇంటిరీయర్ డిజైనింగ్, స్ఫూర్తి కలిగించేలా మహామహాహుల సూక్తులు, ఆసక్తికరమైన చిత్రాలు, తదితర ప్రత్యేక ఆకర్షణలు ఎన్నో ఈ భవంతిలో ఉన్నాయి.
కాటలిస్ట్లో ఒక్కో స్టార్టప్కు ఏడాదిపాటు సమయం ఇవ్వనున్నారు. ఆ సమయం తర్వాత వారి ఆలోచన సఫలం కాకపోతే నిరాశలో కూరుకుపోకుండా, ఐఎస్బీద్వారా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా అందజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. హెల్త్కేర్ విభాగంలోని సంస్థలు, ఔత్సాహికులు కూడా ముందుకు వస్తున్నారు. టీ హబ్లో ఇప్పటికే 120 స్టార్టప్లకు అవకాశం ఇవ్వగా మరో 200 కంపెనీలు అనుమతికోసం ఎదురుచూస్తున్నాయని సమాచారం.