ప్రజలకు కన్నీళ్లు, మంత్రులకు పర్వాలు: ధ్వజమెత్తిన రావుల
మహబూబ్నగర్/ హైదరాబాద్: ప్రజలు కరువుతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే మంత్రులు పండుగల్లో మునిగితేలుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మహబూబ్నగర్లో మీడియాతో మాట్లాడారు.
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, కరువుపై ఈ నెల 17న తహసీల్దార్ ఆఫీస్ల ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 14 నెలలు పాలనలో ఒక్క హౌసింగ్ బిల్లు కూడా చెల్లించలేదని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ విచారణ పేరుతో పేదలను అవమానిస్తున్నారని రావుల ఆగ్రహంవ్యక్తం చేశారు.
డీపీఆర్ కూడా తయారు కాని పాలమూరు ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారనడం విడ్డూరంగాఉందన్నారు. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారువు రాజకీయాలను కలుషితం చేస్తున్నారని రావుల చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు.
దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు సిద్ధపడాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వివేక్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సవాల్ విసిరాడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు మాటలు నీటి మూటల్లాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. హరీష్రావు చంద్రబాబు జపం చేస్తూ తన ఉనికిని కాపాడుకోవాలని భావిస్తున్నాడని వివేక్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులపై అఖిలపక్ష భేటీ ఎందుకు నిర్వహించడం లేదని వివేక్ ప్రశ్నించారు.