కేసీఆర్ చెప్పెవన్నీ అబద్దాలే: డాక్యుమెంట్స్తో మీడియా ముందుకు రేవంత్
హైదరాబాద్: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2012లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు.
1975లో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చేసుకన్న ఒప్పందాలకు అనుగుణంగానే కొనసాగింపుగా 2012లో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన చెప్పారు. ఇందులో చాలా అంశాలున్నాయని చెప్పిన ఆయన రెండు రాష్ట్రాల అధికారులతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు, బ్యారేజీలు, ముంపును పరిశీలించేందుకు మూడు రకాల కమిటీలను ఏర్పాటు చేస్తూ ఒప్పందంలో చేర్చారని ఆయన పేర్కొన్నారు. వాడుకునే నీళ్ల ప్రాతిపదికన బట్టి ఖర్చులను భరించాలని, ప్రాజెక్ట్ ఎత్తు అంశాన్ని ఏపీ ఛీప్ ఇంజనీర్ నాయకత్వంలో ఒప్పందంలో చేర్చారని అన్నారు.
సాంకేతిక కమిటీలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు మహరాష్ట్రలోని రెండు జిల్లాలకు చెందిన కలెక్టర్లను సభ్యులుగా నియమించారని తెలిపారు. సాంకేతిక కమిటీ కాబట్టి నిర్మాణాలకు సంబంధించిన విషయాలను కూలంకుషంగా చర్చించి ప్రాజెక్టుని కట్టాలని నిర్ణయించారు.
160 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా బ్యారేజీ నిర్మించుకోవచ్చని ఒప్పందంలో ఉందని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండోది స్టాండింగ్ కమిటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేస్తూ ఒప్పందం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
2012లో చేసుకున్న ఒప్పందంలోని అంశాలను కాదని, వాటిని మార్చివేసి 2016లో సీఎం కేసీఆర్ చేసుకున్న ఒప్పందంవల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందో సంబంధిత డాక్యుమెంట్స్తో సహా గురువారం పత్రికలకు విడుదల చేశారు.
2012లో ఆనాటి ప్రభుత్వం మహా సర్కార్తో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నీటి పంపకాలు, నీటి విధానాన్ని బట్టి నిర్మాణ వ్యయాన్ని పంచుకోవాలని ఇందులో స్పష్టంగా ఉందని అన్నారు. నిపుణల కమిటీ నివేదికలో ఏముందో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.