తెలుగువారు క్షేమం: మా దగ్గర చదువుకున్న విద్యార్ధులే కిడ్నాప్ చేశారన్న లక్ష్మీకాంత్
హైదరాబాద్: లిబియాలో ఉగ్రవాదులు చెరలో బందీలుగా ఉన్న తెలుగు వారి గురించి ఆందోళన చెందవద్దని, వారిని బాగా చూసుకుంటామని ఐసిస్ ఉగ్రవాదులు హామీ ఇచ్చినట్టు ఉగ్రవాదుల చెర నుంచి బయటపడి భారత్కు చేరుకున్న బెంగుళూరు వాసి లక్ష్మీకాంత్ రామకృష్ణ తెలిపారు.
అంతేకాదు ప్రొఫెసర్లమైన తమను కిడ్నాప్ చేయడం తప్పని ఐసిస్ ఉగ్రవాదులు అంగీకరించినట్టు తెలిపారు. తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలతో పాటు కిడ్నాప్కు గురై మంగళవారం బెంగుళూరు చేరుకున్న అనంతరం లక్ష్మీకాంత్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.
తనతో పాటు అపహరణకు గురైన తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగానే ఉన్నారని తెలిపాడు. యూనివర్సిటీలో తమ వద్ద చదువుకుని, ఆ తర్వాత ఉగ్రవాదులుగా మారిన విద్యార్ధులే తమను కిడ్నాప్ చేశారని తెలిపారు. వీరంతా 13 నుంచి 17 సంవత్సరాల వయసువారేనని, తమను బాగా చూసుకున్నారని తెలిపారు.
ఉగ్రవాదుల లీడర్ పేరు షేక్ అని, తాను తిరిగి వచ్చేటప్పడు ఆయన మాట్లాడుతూ, బందీలుగా ఉన్న ఇద్దరి గురించి ఆందోళన వద్దని, వారిని బాగా చూసుకుంటామని హామీ ఇచ్చాడని అన్నారు. వారి క్షేమ సమాచారాల గురించి తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక నెంబర్ కూడా ఇచ్చారని రామకృష్ణ చెప్పారు.
హైదరాబాదీలు క్షేమంగా తిరిగి వస్తారని చెప్పారు. కిడ్నాప్ చేసిన రెండు రోజులకు తనను విడుదల చేశారని చెప్పిన ఆయన, ఈరోజు తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజని వ్యాఖ్యానించారు. లిబియాలోని సిర్టే వర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్న నలుగురు భారతీయులను ఐసీస్ ఉగ్రవాదులు ఐదు రోజుల కిందట కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత రెండు రోజులకు కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్కుమార్లను విడుదల చేశారు. మూడు రోజుల క్రితం ఐఎస్ చెర నుంచి బయటపడిన వారు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం చేరుకున్నారు.