సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ఊరట
సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తర్వాతి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం సినీనటుడు మోహన్ బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను డిసెంబర్ 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. మోహన్ బాబు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబుపై కేసు నమోదైంది.

తిరుపతి ఘటన హృదయాన్ని కలిచివేసింది: మోహన్ బాబు
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మోహన్ బాబు స్పందించారు. ఈ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్ల కోసం తిరుపతి కౌంటర్ల వద్దకు వెళ్లిన భక్తులు మరణించడం తన హృదయాన్ని కలిచివేసిందన్నారు మోహన్ బాబు.
ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అతిపెద్ద ధార్మిక సంస్థ. వారు భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అయినప్పటికీ ఇలా జరగడం దురదృష్టకరం. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని, మరణించినవారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నా అని మోహన్ బాబు పేర్కొన్నారు.
కాగా, బుధవారం రాత్రి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో 41 మంది గాయపడ్డారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. కాగా, తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.












Click it and Unblock the Notifications