రేణుకా! ఇది మీకు తగునా?: సామాజిక మాధ్యమాల్లో విమర్శల వర్షం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ పార్టీ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరీపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. తన కుటుంబంతో కలిసి ఓ ఫ్యామిలీ రెస్టారెంటుకు వెళ్లిన రేణుక.. తన ఇంట్లోని ఓ చిన్నపాపను చూసుకునే అమ్మాయికి కనీసం విలువ ఇవ్వకుండా వారంతా భోజనం చేశారు.
అంతేగాక, ఆ అమ్మాయిని కుర్చీలో 'కూర్చో' అని కూడా చెప్పకుండా అలాగే నిల్చుబెట్టి ఉంచారు. వారు భోజనం చేసేంతవరకు అలాగే చేతులు కట్టుకుని నిల్చునేవుంది ఆ అమ్మాయి. కాగా, ఈ ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమంలో పలువురు ఆమెపై మండిపడుతున్నారు.
రిషి బగ్రీ అనే వ్యక్తి ఆ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఒకే రోజు 1700మంది రీ ట్వీట్ చేశారు. 'ప్రియమైన రేణుకా చౌదరీగారూ.. మీ చిన్నారిని చూసుకునే అమ్మాయికి భోజనం పెట్టించలేనప్పుడు వారిని అసలు రెస్టారెంట్లకు తీసుకెళ్లకండి' అంటూ ట్వీట్ చేశారు.
'ఇప్పటికే పెద్ద వాళ్ల ఇళ్లలో వెలి కొనసాగుతుందని చెప్పడానికి ఈ దృశ్యం ఒక సజీవ సాక్ష్యం' అని మరొకరు బదులిచ్చారు. ఇంకొంతమంది మాత్రం 'కాంగ్రెస్ పార్టీ కల్చర్' ఇదేనంటూ దుమ్మెత్తిపోశారు.
అంతేగాక, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పప్పుతో భోజనం చేస్తున్నప్పుడు కూడా.. రేణుకా ఇలాగే నిల్చుంటారని పేర్కొన్నారు. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఇలా చేస్తారా? అని అంటూ చురకలంటించారు మరికొందరు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతూ, మాజీ మంత్రి అయిన రేణుకా ఇలా ప్రవర్తించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరి మాజీ కేంద్రమంత్రి వీటికి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.