తెలంగాణలో పదవీ విరమణ వయసు పెంపు, వారికి మాత్రమే
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 60 ఏళ్లు దాటిన యూనివర్సిటీ ప్రొఫెసర్లు మరో ఐదేళ్లపాటు తమ విధుల్లో కొనసాగనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. కాగా, ఉన్నత విద్యాశాఖ పరిధిలో 12 యూనివర్సిటీలు ఉన్నాయి. వాటిలో 2817 ప్రొఫెసర్ల గ్రాంట్స్ పోస్టులకు 757 మందే పనిచేస్తున్నారు. ఏకంగా 2060 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 73 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

ప్రతి నెలా ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల్లో ఇద్దరు ముగ్గురు చొప్పున పదవీ విరమణ పొందుతున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా ఎడ్యుకేషన్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు. వారే అన్ని వర్సిటీలకు డీన్లుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్లుగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కన్వీనర్లను నియమించాలన్నా ఎక్కడా సరిపడా ప్రొఫెసర్లు లేకపోవడం గమనార్హం. మహాత్మా గాంధీ వర్సిటీ నిర్వహించే పీఈసెట్, శాతవాహన వర్సిటీ చేపట్టే ఎడ్ సెట్లకు కన్వీనర్లుగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లే వ్యవహరిస్తుండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసుు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచే ఆలోచన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల వెల్లడించారు.












Click it and Unblock the Notifications