పీసీసీ వస్తే సీఎం అనుకుంటున్నారా: తెలంగాణ ముమైత్ రేవంత్: దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకో : కౌశిక్..!!
కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చి 50 కోట్ల రూపాయాలు మాణిక్ ఠాకూర్ కు ఇచ్చి పదవి పొందాడని వ్యాఖ్యానించారు. మాణిక్ ఠాకూర్ సైతం ఒక యూస్ లెస్ ఫెలో అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేసారు. జానారెడ్డి లాంటి చాలామంది సీనియర్లు ఉన్నా డబ్బులుకు పదవి అమ్ముకున్నారంటూ ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో తనకు 62 వేల ఓట్లు తెచ్చుకున్న తనను కాదని...డిపాజిట్లు రాని వాళ్లు నేతలా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ నుండి పొన్నం ప్రభాకర్ ను పోటీ చేయించాలని రేవంత్ ఆలోచనగా చెప్పారు.
ఆయనకు కరీం నగర్ లో డిపాజిట్ రాలేదని..ఎంపీగా పోటీ చేస్తే అయిదు నియోజకవర్గాల్లో ఆయనకు డిపాజిట్లు రాకున్నా..హుజూరాబాద్ లో నా దగ్గర 50 వేల ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓడిపోతోందని ముందుగానే చెప్పటం చేతకాని తనమని చెప్పారు. ఈటలకు రేవంత్ అమ్ముడు పోయాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎవరు వచ్చినా.. రారా బాబు ఫొటో దిగు అంటాడు తప్ప...ఆయన పొటోలు ఇవ్వటానికి ఏమైనా సినిమా హీరోనా అని ప్రశ్నించారు. తెలంగాణను చంద్రబాబు పాదాల దగ్గర పెట్టాడంటూ మండిపడ్డారు.
Recommended Video
ఏ నేత రేవంత్ కు పీసీసీ ఇవ్వటం పైన సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ , శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క వంటి వారంతా ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రేవంత్..పొన్నం కలిసి హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోమని సవాల్ చేసారు. ఈటల బీజేపీలో చేరిన తరువాత కూడా ఆయన కాంగ్రెస్ లో ఉంటే అంటూ రేవంత్ ఎలా మాట్లాడుతారని నిలదీసారు. డిపాజిట్ పోయిన వాడు ఇప్పుడు అభ్యర్ధా అంటూ ప్రశ్నించారు. ముమైత్ ఖాన్ వచ్చినా జనాలు వస్తారని..విజిల్స్ వేస్తారని చెబుతూ... తెలంగాణ ముమైత్ ఖాన్ రేవంత్ రెడ్డి అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన భవిష్యత్ కార్యాచరణ హుజూరాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులతో చర్చించి..నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. రెండు..మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తానని వెల్లడించారు.