బోనం వేడుకల్లో రేవంత్: అంగరంగ వైభవంగా
Revanth Reddy: చారిత్రాత్మక ఆషాఢం బోనాలు హైదరాబాద్లో కన్నులపండుగా సాగుతున్నాయి. కిందటి ఆదివారం గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. అనంతరం బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో భక్తులు బోనం ఎత్తారు. అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఆషాఢమాసంలో వచ్చే తొలి ఆదివారం నాడు బోనాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. తొలి బోనం- గోల్కొండలో వెలిసిన జగదంబికా అమ్మవారికి సమర్పిస్తారు. ఆదివారమే తొలి బోనం వైభవంగా పూర్తయింది కూడా. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు.

నేడు హైదరాబాద్ బేగంపేట్లో గల ప్రజా భవన్లో బోనాల ఉత్సవాలు వైభవంగా సాగాయి. ప్రజా భవన్ ప్రాంగణంలో గల నల్లపోచమ్మ అమ్మవారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బోనాలను సమర్పించారు. సంప్రదాయంగా బోనాల వేడుకలను నిర్వహించారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తారు. పోతరాజు విగ్రహాన్ని భుజాల మీద మోసుకొచ్చారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపుగా నల్లపోచమ్మ ఆలయానికి వెళ్లారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి సారెను సమర్పించారు.

కొండా సురేఖ బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలను పలికారు. తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక వరుసగా సికింద్రాబాద్, హైదరాబాద్ బోనాలు జరుగనున్నాయి. ఈ రెండు ఆలయాలను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సందర్శించనున్నారు.












Click it and Unblock the Notifications