ఎంపీలే కాదు..వాళ్లూ వస్తారు, కేసీఆర్! ఎవర్ని బెదిరిస్తున్నావ్: రేవంత్, కేటీఆర్కు దిమ్మతిరిగే కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖానాపూర్ సభలో చేసిన వ్యాఖ్యలకు, అలాగే, కొడంగల్ నియోజకవర్గంలో మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ చేసిన సవాల్కు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం ధీటుగా స్పందించారు.
ఎన్నికల్లో ఓడిపోతే తనకు వచ్చే నష్టం లేదని, ఇంట్లో రెస్ట్ తీసుకుంటానని కేసీఆర్ చెప్పగా, ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, రేవంత్ చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై మాట్లాడారు.
చివరి నిమిషం దాకా ఆశపెట్టి: కేసీఆర్కు మరో భారీ షాక్, రాజీనామా చేసిన కీలకనేత
అవన్నీ చంద్రబాబు అడ్డుకున్నారా?
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిత్యం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ మనకు నీళ్లు రావని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఏపీ మన రాష్ట్రానికి కింద ఉందని, అది నీళ్లు ఆపే పరిస్థితి ఉండదని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో చంద్రబాబు దేనికి అడ్డుపడ్డాడో చెప్పాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ అది నెరవేరలేదని, దానికి చంద్రబాబు అడ్డుపడ్డాడా అని ఎద్దేవా చేశారు. అలాగే 12 శాతం రిజర్వేషన్లను అడ్డుకున్నారా అని నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు అనుకున్నా ఆపలేడన్నారు.
సోనియా గాంధీ ఇవి చెబుతారు
రేపు (శుక్రవారం) సాయంత్రం ఐదు గంటలకు మేడ్చల్లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సభ ఉందని రేవంత్ చెప్పారు. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పారు. ప్రజలకు జరిగిన అన్యాయం, కేసీఆర్ వైఫల్యాలను ఈ సభలో తమ పార్టీ నాయకురాలు సోనియా వివరిస్తారని తెలిపారు. అలాగే, రాబోయే ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుందో కూడా చెబుతారని అన్నారు.
కేటీఆర్కు దిమ్మతిరిగే కౌంటర్
కేసీఆర్, మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్లకు పిచ్చిపట్టి రాష్ట్రమంతా తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓడిపోయే వాళ్లకు మాటలు ఎక్కువ అని కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే ప్రతిపక్షంలో ఉండి ధర్మాన్ని నెరవేర్చవచ్చునని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లు రాకుంటే సన్యాసం తీసుకుంటానని చెప్పిన కేటీఆర్, తెరాసకు 99 సీట్లు వస్తే ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకోలేదని ప్రశ్నించారు. బుధవారం కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ దానికి సిద్ధమా అని కేటీఆర్ అన్నారు. దీనికి రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
ఎంపీలో కాదు, ఎమ్మెల్సీలు వస్తారని బాంబు పేల్చారు
కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి ఎంపీలే కాదని, తెరాస ఎమ్మెల్సీలు కూడా తమ పార్టీలోకి వస్తున్నారని రేవంత్ రెడ్డి మరోసారి బాంబు పేల్చారు. కేసీఆర్, కేటీఆర్లకు దమ్ము ఉంటే వలసలను ఆపుకోవాలని సవాల్ విసిరారు. ఇటీవల రేవంత్ మాట్లాడుతూ.. ఇద్దరు ముగ్గురు ఎంపీలు తెరాస నుంచి తమ పార్టీలోకి వస్తారని చెబుతున్నారు.
కేసీఆర్! ఎవరిని బెదిరిస్తున్నావ్?
ఓడిపోతే ఫాంహౌస్లో పడుకుంటానని అంటే ఎవరిని బెదిరిస్తున్నారని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓడిపోతే ప్రతిపక్షంలో ఉండి ధర్మాన్ని నెరవేర్చవచ్చునని కేసీఆర్కు సూచించారు. ప్రతిపక్షంలో కూడా ఉండలేమని కాడి కింద పడేస్తున్నారని చెప్పారు. తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న కేసీఆర్, అలాగే కేటీఆర్ మాటలను ప్రజలు ఆలోచించాలని చెప్పారు.