కోదండ ఇష్యూలోకి కేసీఆర్ని లాగిన రేవంత్, మీ వెనుక ఏపీ నేతనా: నాగం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ చైర్మన్ రేవంత్ రెడ్డి పైన తెరాస చేస్తున్న విమర్శలపై తెలంగాణ టిడిపి నేతలు, కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు మంగళవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా అని పొన్నం నిప్పులు చెరిగారు. జేఏసీ ఎక్కడుందని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారని.. తెలంగాణ ఏర్పడ్డాక తెరాస ఎక్కడుందని మేం ప్రశ్నిస్తున్నామని, దానికి సమాధానం చెప్పాలన్నారు.
ప్రశ్నిస్తున్నందుకే కోదండరాం పైన విరుచుకుపడటం ఎంత వరకు సబబు అన్నారు. తప్పులను ఎత్తి చూపొద్దా అన్నారు. మంత్రులు మూకుమ్మడి దాడిని ప్రజలు హర్షించరన్నారు. కోదండరాంకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని పొన్నం చెప్పారు. ఆయనకు అందరు మద్దతుగా నిలవాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెరాస నేతలు కోదండరాం పైన చేసిన వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెరాస నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఎటువంటి భావజాలంతో బంగారు తెలంగాణ సాధించుకోవాలనే విషయమై తెలంగాణ ఉద్యమకారులు ఓ అభిప్రాయానికి వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కోదండరాంను తిట్టిన తెరాస నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇప్పుడు చెడ్డవాడయ్యాడా?: నాగం
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఇప్పుడు కోదండరాం కేసీఆర్కు చెడ్డవాడు అయ్యాడా అని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను మెచ్చుకుంటే మంచివారు, లేదంటే చెడ్డవారు అవుతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ విదానాలను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అన్నారు.
కేసీఆర్ అవినీతిని రుజువు చేస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని నాగం సవాల్ విసిరారు. తాను టిడిపికి రాజీనామా చేసి, ఒంటరిగా గెలిచానని గుర్తు చేశారు. ఎఫ్ఆర్బీఎంను 3 నుంచి 3.5 శాతానికి పెంచినప్పటికీ రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంకా ఏపీ నేతనే నడిపిస్తున్నట్లుగా ఉందన్నారు.
భయపెడుతున్నారా?: వీహెచ్
తెలంగాణలో దొరల, గడీల పాలనను గుర్తుకు తెస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తీరుపై జేఏసీ నేత కోదండరాం చేసిన ఆరోపణల్లో తప్పేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. పాలనలో తప్పులు ఎత్తి చూపిన కోదండరాంను భయపెడతారా? అని ప్రశ్నించారు.
క్యాబినెట్ మొత్తం ఒకవైపు నిలిచి కోదండరాంను విమర్శించడం తగదన్నారు. కేసీఆర్, ఆయన మంత్రుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారికి బుద్ధిచెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. తప్పులు చూపితే, భయపెట్టే ధోరణిని మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
భూములు బలవంతంగా లాక్కోలేదు: కోదండకు నాయిని
మల్లన్న ప్రాజెక్టు కింద భూములను తాము బలవంతంగా లాక్కోలేదని మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం కోదండరాంకు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటుందని అనడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని ప్యాకేజీ తెలంగాణ ఇస్తోందన్నారు.
రైతుల ఆత్మహత్యల నివారణకు ఏ సీఎం కూడా తీసుకోలేని చర్యలను కేసీఆర్ తీసుకుంటున్నారన్నారు. మిషన్ కాకతీయ అందులో భాగమేనని చెప్పారు. మిషన్ కాకతీయ పథకానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయన్నారు. రేవంత్ ఓ బచ్చా అన్నారు.
మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కోదండరాం కలలలో కూడా ఊహించి ఉండరన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కోదండరాంకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశలకు కోదండరాం గండి కొడుతున్నారన్నారు. కోదండరాంని జేఏసీ ఛైర్మన్ చేసింది ఎవరో చెప్పాలని నిలదీశారు.