శనీశ్వరరావును పాతాళానికి తొక్కేస్తా: సిద్దిపేటలో శివాలెత్తిన రేవంత్ రెడ్డి
సిద్దిపేట: ఇటు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్ రావు.. అటు ప్రధాని మోడీ, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు లోక్సభ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో గురువారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రేవంత్ మాట్లాడారు.
సిద్దిపేటను 45 ఏళ్ల నుంచి పాపాల బైరవుల్లా మామ, అల్లుడు పట్టిపీడిస్తున్నారని కేసీఆర్, హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు రేవంత్. శనీశ్వరరావు నుంచి విముక్తి కల్పించాలన్నారు. మెదక్ లోక్సభ స్తానం నుంచి అప్పట్లో ప్రాతినిథ్యం వహించిన ఇందిరా గాంధీ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారన్నారు. నెహ్రూ, ఇందిర వల్లే వేలాది పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చాయని రేవంత్ చెప్పుకొచ్చారు.

సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరకపోతే శాశ్వతంగా బానిసత్వం వస్తుందన్నారు రేవంత్. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చారని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి వద్ద డబ్బులు ఎక్కువ ఉన్నాయనే మామ, అల్లుడు ఆయనకు టికెట్ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. కలెక్టర్గా పని చేసిన సమయంలో వెంకట్రామిరెడ్డి వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలను కొల్లగొట్టారన్నారు.
నిజాం దగ్గర ఖాసీం రజ్వీ ఎలాగో.. కేసీఆర్కు వెంకట్రామిరెడ్డి అలా అని రేవంత్ వ్యాఖ్యానించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్కు చెందిన వ్యక్తిని నిలబెట్టడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరా? అని ప్రశ్నించారు. సిద్దిపేటలో సభ పెడితే ఎవరూ రారని కొందరు నేతలు అన్నారని.. కానీ, ఇక్కడి జనసంద్రాన్ని చూస్తుంటే.. నీలం మధుకు లక్ష మెజార్టీ పక్కా అని అనిపిస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు.
Hon'ble CM Sri. A.Revanth Reddy will participate in Rally and corner meeting at Siddipet https://t.co/wW3geUjU0G
— Telangana Congress (@INCTelangana) May 2, 2024
మరోవైపు, ప్రధాని మోడీ, బీజేపీపైనా విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. పదేళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు, సిద్దిపేటకు గాడిద గుడ్డు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. నీలం మధును గెలిపిస్తే ముదిరాజ్ సామాజికవర్గం వారికి మంత్రి పదవి ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చారు.
ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. హరీశ్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. హరీశ్ రావు రాజీనామా చేశాక.. సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామని రేవంత్ చెప్పారు. శనీశ్వరరావును పాతాళానికి తొక్కేస్తానంటూ శివాలెత్తారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications