కేసీఆర్ వైఖరితో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరం: రేవంత్ రెడ్డి, బీజేపీపైనా ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు నచ్చితే నజరానాలు ఇస్తారని.. లేదంటే జరిమానాలు వేస్తారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బచావో హైదరాబాద్ పేరుతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం జరిగింది.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ రేవంత్ ఆందోళన
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసు శాఖలో సమర్థులైన వారిని పక్కనపెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు. ఒక అధికారి ఏడున్నరేళ్లుగా ఒకేస్థానంలో ఉన్నారన్నారు. కొంతమంది ఐపీఎస్లకు గంపగుత్తగా రెండు కంటే ఎక్కువ శాఖలు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.
పదోన్నతి పొందిన వాళ్లను కూడా ఖాళీగా కూర్చోబెట్టారన్నారు. మైనర్ బాలికపై అత్యాచార ఘటన వీడియో కావాలనే బయటపెట్టారని, ఒప్పందంలో భాగంగానే రఘునందన్ వీడియో బయటపెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పట్టపగలు కూడా పిల్లలను ఇంట్లో నుంచి బయటికి పంపే పరిస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ అదుపు తప్పిందన్నారు. మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఆ డీసీపీ కమల్ హాసన్ను మించి నటించారన్న రేవంత్
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలంటే సమర్థవంతులకు పోస్టింగ్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. నలుగురు ఐపీఎస్ల చేతుల్లోనే 15 శాఖలున్నాయని, నిజాయితీగా పనిచేసే ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారన్నారు. రిటైర్డ్ అధికారులకు మళ్లీ పోస్టింగ్లు ఇచ్చి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్నారు.
కొంతమంది కేసీఆర్ తొత్తులకే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. వీళ్లంతా సీఎంకు మంచి చేయడానికే పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచారం కేసులో జోయల్ డేవిస్.. స్వాతిముత్యంలో కమల్ హాసన్ కంటే ఎక్కువగా నటించారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాగా, ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్ రెడ్డితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మల్లు రవి, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, టీడీపీ, బీఎస్పీ, వైయస్సార్టీపీ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సమన్వయ కర్తగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యవహరించారు.
బీజేపీకి సహకరిస్తున్నారంటూ కేసీఆర్పై రేవంత్
ఆ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండి బీజేపీకి సాయం చేస్తారన్నారు. కలిసి పనిచేద్దామన్న కేసీఆర్.. మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. తాము నిరసన తెలిపితే పోలీసులతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం, ఈడీ తీరుకు నిరసనగా రేపు రాజ్భవన్ ముందు ధర్నా చేస్తమన్నారు. ఖైరతాబాద్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ ఉంటుందని, కాంగ్రెస్ శ్రేణులు రేపటి ర్యాలీకి తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు.