వాటికే అంబాసిడర్లు: కేసీఆర్, కేటీఆర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి
గజ్వేల్: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్లో ఏర్పాటు చేసిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు హాజరైన కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి రేవంత్ ప్రసంగించారు. గజ్వేల్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పారు. టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణకు ఇవాళ స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని.. కానీ, రాష్ట్రంలో ప్రజలకు వేడుక జరుపుకునే స్వేచ్ఛ లేదన్నారు.
సీఎం కెసిఆర్ తాగు బోతులకు... కేటీఆర్ డ్రగ్స్ వాడే వాళ్లకు అంబాసిడర్ అని రేవంత్ రెడ్డి తీవ్య వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో పిలుస్తున్న హీరోలకు డ్రామా రావు దోస్తు కాదా? అని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ సన్నాసులు గజ్వెల్ రండి చూసుకుందాం అన్నారని... 2 లక్షలు మంది కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వెల్ గడ్డ మీద కదం తొక్కారన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం నిజాం రజాకారులను ఇదే రోజు తరిమి కొట్టారన్నారు. మల్లన్న సాగర్ లో 60 వేలు ఎకరాలు భూమి తీసుకుని 14 గ్రామాలుని ముంచారన్నారు. కొండ పోచమ్మ సాగర్లో తమ బంధువులు భూమి కాపాడటం కోసం పేదలు భూమి ని లాక్కొన్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. మెదక్ ప్రజలు ఆదరించి ఎంపీ చేయడం వలన ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు రేవంత్.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీదేనని రేవంత్ అన్నారు. కానీ, రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. పార్టీని విలీనం చేస్తానని మోసం చేసిన దగుల్బాజీ కేసీఆర్ అని విమర్శించారు. అర శాతం జనాభా ఉన్న కేసీఆర్ ఇంట్లో నాలుగు పదవులు ఉన్నాయని.. 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు అయిందని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. తెలంగాణ వచ్చిన మొదటి ఏడాది మద్యం ఆదాయం 10883 కోట్లు.. కానీ ఇప్పుడు 36000 కోట్లు ఆదాయం వస్తుందని... మద్యం ఆదాయం 300 శాతం పెరిగిందని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడారు.తాము అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన దళిత గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తామని తెలిపారు. వాటికోసం ఇప్పుడు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. సోనియాగాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. కేసీఆర్ ఢోకా చేశారు, ఆయనను ప్రజలు నమ్మద్దు అని సూచించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ, మోడీ పాలనలో దేశం అంధకారంలో ఉందన్నారు. తెలంగాణ విలీనమైన రోజున దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు. వాస్తవంగా ఈ సభకు రాహుల్ గాంధీ రావాల్సింది, ఇతర కార్యక్రమాలతో రాలేదని ఖర్గే తెలిపారు.