రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
రంగారెడ్డి: దేశంలో 70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ తలపెట్టిందని, ఇదే వారి ఆఖరి అస్త్రమని ఆరోపించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా గురువారం రాత్రి రాజేంద్రనగర్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్, మోడీ పదేళ్లు అధికారంలో ఉన్నారని, అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. డిసెంబర్ 3న ప్రజలు కారును షెడ్డుకు పంపించారని, షెడ్డుకు పోయిన కారు తుప్పుపట్టి పోయిందని రేవంత్ ఎద్దేవా చేశారు. అది ఇక రాదని, కారు తుప్పుపట్టి పోయినందుకే బస్సు వేసుకుని బయలుదేరారని అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లు కేసీఆర్ వైఖరి ఉందని.. ఆయన పదేళ్ల పాటు ఎప్పుడైనా ఫామ్హౌజ్ నుంచి బయటకు వచ్చారా? అని రేవంత్ ప్రశ్నించారు.

పదేళ్లలో ఎప్పుడైనా బయటికి వచ్చి, రైతులతో మాట్లాడారా ? పంటలను పరిశీలించారా ? అని సీఎం రేవంత్ నిలదీశారు. నాలుగు గంటలు టీవీలో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి వచ్చి ఎందుకు సమాధానాలు చెప్పలేదని ప్రశ్నించారు. రైతుల ఆదాయం పెంచుతానన్న మోడీ.. వారికి ఖర్చులు పెంచారని ఆరోపించారు. నల్ల చట్టాలు తెచ్చి వేల మంది రైతుల ప్రాణాలు బలి తీసుకున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే.. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంటులో మూడొంతుల మెజార్టీ వస్తే, రిజర్వేషన్లు రద్దు చేయటమే ఆ పార్టీ అజెండా అని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ విధానాలు, అజెండానే మోడీ సర్కారు అమలు చేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ అజెండాలో ఉందిని, దాన్ని అమలు చేయడమే బీజేపీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications