రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే: జీవో 111 జీవో రద్దుపై రేవంత్ రెడ్డి, జీవో 69 చెల్లదంటూ ఫైర్
హైదరాబాద్: జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో చెల్లదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కాపీని జతచేస్తూ రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్టు చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు 111 జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ 2007 జులై 16న హైకోర్టు స్టే విధించిందన్నారు.
పరివాహక ప్రాంతాన్ని పది కిలోమీటర్ల నుంచి 500 మీటర్లకు తగ్గించాలని కోరడంపై హైకోర్టు ఈ స్టే విధించినట్లు రేవంత్ చెప్పారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇచ్చిన జీవో 69 చెల్లదన్నారు. మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు చేసి ఆంక్షలు ఎత్తేశారని రేవంత్ రెడ్డి ారోపించారు.
కాగా, బుధవారం 111 జీవో పరిధిలోని గ్రామాల్లో నిబంధనలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 84 గ్రామాలకు 111 జీవో నిబంధనల నుంచి విముక్తి లభించింది. జీవో 111 పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతోపాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినరాదని షరతు విధించింది. షరతుల్లో భాగంగా ఎస్టీపీల నిర్మాణం, కాలుష్య తీవ్రత తగ్గింపునకు చర్యలు తీసుకోనున్నారు. భూగర్భ జలాల నాణ్యత పరిరక్షణకు చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం.. జలాశయాల్లోకి నీరు వెళ్లేలా డైవర్షన్ ఛానళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు విధివిధినాలు, సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జంట జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రీన్ జోన్లు సహా జోన్ల నిర్దరణ, ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కమిటీ విధనాలు రూపొందించాల్సి ఉంటుంది. రోడ్లు, డ్రైన్లు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రైన్ల నిర్మాణానికి నిధులు సమీకరించాల్సి ఉంటుంది.
కాగా, హైదరాబాద్ నగర శివారులోని గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం జీవో 111 అమల్లో ఉంది. పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో నెంబర్ 192ను తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జోవో 111ను తెచ్చింది. ఈ జీవో ప్రకారం.. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లేఅవుట్లలో 60 శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. వినియోగించే భూమిలో 90 శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. ఇందుకు గానూ హుడా బాధ్యత వహించాలి. రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీ+2కి మించి నిర్మాణాలకు అనుమతి లేదు.
ఇది ఇలావుండగా, జంట జలాశయాలు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు తీర్చేవి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై ఆధారపడటం పూర్తిగా తగ్గిపోయిందని టీఆర్ఎస్ సర్కారు, స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో జీవో 111 ఎత్తివేయడం లేదా పరిధి కుదించాలని కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ జీవోపై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. అయితే, జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై గత సెప్టెంబర్ నెలలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ ఇబ్బంది లేకుండా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే తాజా షరతులతో జీవో 111 పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికీ 111 జీవో ఎత్తివేత అంశంపై పర్యావరణ వేత్తలు తమ పోరాటాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.