రేవంత్ రెడ్డి ఓ బచ్చా: నాయిని, రచ్చకెక్కొద్దు: కోమటిరెడ్డికి షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి ఓ బచ్చా అని, అందుకే ఇష్టం వచ్చినట్లు తమ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆదివారం అన్నారు.
మెదక్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తిరుపతి మహానాడులో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారన్నారు. తెలంగాణ టీడీపీ నేతలకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రా నేతలు అడ్డుతగులుతున్నారన్నారు.
ఆరు నూరైనా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కోటి ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు. పాత ప్రాజెక్టులనే రీడిజైన్ చేస్తున్నామని, కొత్తవి లేవని చెప్పారు. జైళ్లలో పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఖైదీల పరివర్తనకు చాలా కార్యక్రమాలు చేపట్టామన్నారు.
రచ్చకెక్కొద్దు: షబ్బీర్
కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సర్వే సత్యనారాయణ వంటి నాయకులు పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. రచ్చకెక్కి పార్టీకి నష్టం చేయవద్దన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడుదామన్నారు.
లేదంటే అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో గెలవలేకపోయామని, ఢీలాపడ్డ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మరింత నష్టం చేకూరుస్తాయన్నారు. నష్టం చేసిన వారిని క్షమిస్తూ పార్టీ ఐక్యత కోసం సీనియర్లు కృషి చేయాలన్నారు.