కేసీఆర్పై రేవంత్ నిప్పులు, కిషన్ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పెద్దవాడూ కాదు, పిల్లవాడూ కాదని, ఓ సన్నాసి అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు.
రైతుల కోసం చంద్రబాబు తీవ్రంగా కష్టపడుతున్నారని, కేసీఆర్ అసమర్థత వల్లే తెలంగాణలో విద్యుత్ కష్టాలు వచ్చిపడ్డాయన్నారు.
కేంద్రం నుంచి చంద్రబాబు అదనపు విద్యుత్ను రాబట్టుకోగలిగారని, కేసీఆర్కు అది సాధ్యపడలేదన్నారు. చేతకానితనాన్ని ప్రజలకు చెప్పకుండా, మామా అల్లుళ్లు మందిని ఆడిపోసుకుంటున్నారని పరోక్షంగా హరీశ్ రావుపైనా సెటైర్ వేశారు.
మిగులు బడ్జెట్ ఉండి కూడా రైతులకు కేసీఆర్ ఏం చేయలేకపోయాడని దుయ్యబట్టారు. తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఎలా లభించిందో చెప్పాలని సవాల్ విసిరారు. బాబు ఒప్పుకోవడవం వల్లే తెలంగాణకు అధిక విద్యుత్ లభించిందని తెలిపారు. కేసీఆర్ ఒప్పుకోకపోయినా ఇది నిజమని రేవంత్ ఉద్ఘాటించారు.
తెలంగాణ శాసనసభలో ప్రవేశపెడుతున్నది ప్రజల బడ్జెట్ కాదని కేసీఆర్ కుటుంబ బడ్జెట్ అని విమర్శించారు. బడ్జెట్ తయారీలో మంత్రుల హస్తం ఏ మాత్రం లేదన్నారు. వాటర్ గ్రిడ్, రోడ్ల కోసం కేటీఆర్కు రూ.35 వేల కోట్లు, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి పేరుతో హరీష్ రావుకు మరో రూ. 35 వేల కోట్లను బడ్జెట్లో కేటాయిస్తున్నారని, ప్రజాసమస్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామన్నారు. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డి ధ్వజం
కేసీఆర్ తాను చేయాల్సిన పనులను చేయడం మానేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ మూడేళ్ల వరకూ విద్యుత్ రాదంటూ రైతులకు ముఖ్యమంత్రి చెప్పడం దారుణమని అన్నారు. సోలార్ విద్యుత్కు కేంద్రం సహకారం అందిస్తామన్నా సీఎం మాత్రం చొరవ చూపడం లేదన్నారు.
హైదరాబాద్లో భారీగా విద్యుత్ చౌర్యం జరుగుతోందని, విద్యుత్ శాఖలో విజిలెన్స్ విభాగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విద్యుత్ పొదుపునకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దారుణమైన భాషను వాడుతున్నారని, ఆ భాషను ఎవరిని ఉద్ధేశించి మాట్లాడుతున్నారో వారికి ఇంటిలిజెన్స్ నివేదికలు పోతున్నాయని, దీనివల్ల కేంద్రంతో సంబంధాలు మరింత మెరుగుపడమంటే ఎలా అన్నారు.
ఎంఐఎంతో తెరాస స్నేహం చేయడంపై మండిపడ్డారు. మజ్లిస్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అధ్వాన్నంగా మారిందని... ఉగ్రవాదులకు అడ్డాగా నిలిచిందని అన్నారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉగ్రవాది దొరికినా, పట్టుబడిన వారి మూలాలు హైదరాబాదులో ఉంటున్నాయని గుర్తు చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల కార్యకలాపాలకు, రిక్రూట్ మెంట్లకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు.
రానున్న గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంను మచ్చిక చేసుకుంటోందని ఆరోపించారు. రేషన్ కార్డుల విషయంలో హైదరాబాదులో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమని కేసీఆర్ సర్కారును హెచ్చరించారు. కేసీఆర్ ఎప్పుడూ తిట్లతోనే కాలక్షేపం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications