బావమరిది కళ్లల్లో ఆనందం: కేటీఆర్పై రేవంత్ సంచలనం, పరిటాలపైనా..
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుపై ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుపై ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే సభను వాయిదా వేశారని అన్నారు. డ్రగ్స్ కేసులో సమాధానాలు చెప్పలేకే సభను ప్రభుత్వం వాయిదా వేసిందని చెప్పారు
Recommended Video
బాబు వచ్చేలోపే టీడీపీ నాశనం, కేసీఆర్ నెత్తిన పాలు: రేవంత్ సంచలనం
డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పట్టిపీడిస్తున్నదో తెలిసిందేనని రేవంత్ అన్నారు. కేటీఆర్ కొడుకు చదువుకునే స్కూల్ తోపాటు ఇతర కాలేజీ, స్కూల్ పిల్లలను కూడా ఈ ఉచ్చులో చిక్కుకున్నారని అన్నారు. 7 ప్రశ్నల వరకు అసెంబ్లీలో చర్చించారని.. తనది 8వ ప్రశ్న అని చెప్పారు. తన ప్రశ్న రాగానే సభను వాయిదా వేశారని అన్నారు.
పైనుంచి ఆదేశాలా.?
సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ కేసు వివరాలను ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. సభ సాంప్రదాయం ప్రకారం తాను అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగానైనా సమాధానం ఇవ్వాల్సి ఉందని, అయితే అది కూడా చేయలేదని అన్నారు. సమాధానం ఇవ్వకూడదని పైనుంచి ఆదేశాలున్నాయని సభ కార్యదర్శి తనకు చెప్పారని అన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు.
కేటీఆర్పై అనుమానం.. నమూనాలు ఇవ్వాల్సిందే..
డ్రగ్స్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పాత్ర కూడా ఉందంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డిలు పబ్బులకు, క్లబ్బులకు వెళ్తావని ఆరోపణలు చేశారని చెప్పారు. అయితే, తాను తన రక్తం, వెంట్రుకలు, గోళ్లు నమూనాల కోసం ఇస్తానని.. మంత్రి కేటీఆర్ కూడా ఇలా చేయాలంటూ సవాల్ విసిరారు. కేసుకు సంబంధం ఉన్న అందరి ప్రముఖుల నమూనాలు సేకరించాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు
కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారనే అనుమానం తనకు బలంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని సవాల్ విసిరితే సమాధానం రాలేదని అన్నారు. కేటీఆర్ తన బావమరిది రాజ్ పాకాల కోసం ఈ డ్రగ్స్ కేసును పక్కన పెట్టించారని రేవంత్ ఆరోపించారు. బావమరిది కళ్లల్లో ఆనందం చూసేందుకు కేటీఆర్ చాలా చేశారని అన్నారు.
అక్కడ అనుమతివ్వకపోతే..
డ్రగ్స్, మహిళలపై వేధింపులు జరుగుతున్నాయనే కారణంగా గోవా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఓ మ్యూజికల్ నిర్వాహకుడి కార్యక్రమానికి అనుమతివ్వలేదని రేవంత్ చెప్పారు. అయితే, కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాల తమ ప్రభుత్వం ఉందని హైదరాబాద్లో అతనితో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయించారని చెప్పారు.
స్వాగతం పలికిన కేటీఆర్..
టీడీపీ ప్రభుత్వ సదుద్ధేశంతో నిర్మించిన భవనంలో 5వేల మంది పోలీసుల పహారాలో ఆ మ్యూజికల్ నైట్ నిర్వహించారని రేవంత్ ఆరోపించారు. ఆ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ స్వయంగా స్వాగతం పలికారని అన్నారు. ఎందుకంటే.. ఆ కార్యక్రమం టికెట్లు అమ్ముకునే వ్యాపారం కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాలదేనని అన్నారు. ఈవెంట్స్ నౌ అనే కంపెనీలో రాజ్ పాకాల భాగస్వామి అని, దీని ద్వారానే ప్రొగ్రాం టికెట్లను అమ్మారని రేవంత్ చెప్పారు.
పిల్లలను కూడా అనుమతించారు..
పెద్దలను మాత్రమే అనుమతించాల్సిన ఈ కార్యక్రమానికి 15ఏళ్ల స్కూల్ పిల్లలను కూడా అనుమతించారని ఆరోపించారు. 21ఏళ్లు నిండని వారిని ఇలాంటి పార్టీలకు అనుమివ్వకూడదనే నిబంధన ఉందని చెప్పారు. అయితే, స్కూల్ పిల్లలకు కన్సెషన్ ఇచ్చి మరీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలికారని అన్నారు. రాత్రి నుంచి ఉదయం 3గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని బావమరిది కోసమే కేటీఆర్ నిర్వహించారని రేవంత్ ఆరోపించారు.
కేసీఆర్.. లోపలెస్తారా?
మహిళలపై ఇలాంటి పార్టీల్లో లైంగిక వేధింపులు జరుగుతాయని అన్నారు. డబ్బుల కోసం ఇంత దుర్మార్గమైన వ్యాపారం చేస్తారా? అంటూ రేవంత్ మండిపడ్డారు. పక్కా ఆధారాలతో వస్తే ఎవరినైనా లోపలెస్తామన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు కేటీఆర్, రాజ్ పాకాలను లోపలెస్తారా? అని నిలదీశారు. రాజ్ పాకాల తన వ్యాపారాలకు పన్నులు కడుతున్నారా? అని రేవంత్ ప్రశ్నించారు.
పరిటాల, మంత్రుల పబ్బులే..
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కొత్తగా 59 పబ్బులు ఏర్పాటయ్యాయని, అవి ఏపీ మంత్రి పరిటాల సునీత, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మరో మంత్రివేనని రేవంత్ ఆరోపించారు. మంత్రుల చుట్టాలవి కూడా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వమే పిల్లల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.