బాబుపైనా పోరాటం చేస్తా, అందుకే తెరాసలోకి పొంగులేటి: రేవంత్
హైదరాబాద్: తెలంగాణకు నష్టం జరుగుతుందంటే తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేస్తామని, ఏపీలో సొంత పార్టీ అధికారంలో ఉందని ఊరుకునేది లేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణకు అన్యాయం జరిగితే ఏపీ పైన తాము పోరాడటానికి సిద్ధమని చెప్పారు. అదే సమయంలో ఖమ్మం ఎంపీ, వైసిపి తెలంగాణ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార తెరాసలో ఎందుకు చేరారో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.
1500 కోట్ల రూపాయల ప్రాజెక్టులను తెలంగాణ సీఎం కెసిఆర్ కట్టబెడితే పార్టీని (వైసిపి) విలీనం చేయక ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఊరూరా తిరిగి వాపోతున్న వైసిపి అధినేత జగన్ తెలంగాణ విషయంలో ఎందుకు మాట్లాడరో చెప్పాలని నిలదీశారు.

ప్రాజెక్టుల పైన నిలదీస్తే తెలంగాణ ద్రోహులు అని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. ప్రాణహిత - చేవెళ్లతో సాగయ్యేది కేవలం లక్షా 60 వేల ఎకరాలేనని చెప్పారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని పాట ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే అరుణ వేరుగా అన్నారు. ప్రాజెక్టు డిజైన్లను జేబులు నింపుకోవడానికి మార్చారని విమర్శించారు. ప్రాజెక్టుల ద్వారా దండుకోవాలని చూస్తున్నారన్నారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
భారీ అవినీతి: నాగం
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భారీ అవినీతి జరుగుతోందని బిజెపి నేత నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లా జన్మహక్కన్నారు.
ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అవినీతి పైనే తమ పోరాటమన్నారు. రెండేళ్లు తెలంగాణలో ప్రాజెక్టులను పడుకోబెట్టి ఇప్పుడు హరీశ్ రావు వెళ్లి సందర్శించడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో కోటలు కడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బాగోతాన్ని బయటపెట్టేందుకు ప్రజల్లోకెళ్తానన్నారు.












Click it and Unblock the Notifications