కెసిఆర్తో బెజవాడలో కొబ్బరికాయల దుకాణం పెట్టిస్తా: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కావాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ చేత విజయవాడలోని అమ్మవారి గుడివద్ద కొబ్బరికాయల దుకాణం పెట్టిస్తానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మల్కాజిగిరి చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్షోలో ఆయన కేసిఆర్పై తీవ్రంగా ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం కేసిఆర్ జాగీర్ కాదని, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కేసిఆర్కు లేదని అన్నారు. 12వందల మంది ఆత్మబలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం తీసుకువస్తే నేడు కేసిఆర్ కుటుంబ పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిపారు. బాబు హెరిటేజ్ గురించి కేసిఆర్ ప్రస్తావించడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చునని, అవసరమైతే కేసిఆర్ కూడా బెజవాడలో కొబ్బరికాయల దుకాణం పెట్టుకోవడానికి తాను సహాయపడతానన్నారు. అబద్ధపు పునాదులపై కేసిఆర్ పాలన సాగుతోందన్నారు. గత ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు.

టిడిపి పాలనలో హైదారాబాద్ నగరానికి ప్రపంచస్థాయిలో గుర్తింపుతీసుకువచ్చారని తెలిపారు. కేసిఆర్ అబద్దాల పరిపాలనను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను తాను చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. టిఆర్ఎస్లో నాయకులే లేనట్టు అన్ని శాఖలు కొడుకుకు అప్పగించడం అతడి రాచరికపు పాలనకు నిదర్శనమన్నారు.
కేటిఆర్కు గ్రేటర్ మొత్తంపై పూర్తిగా అవగాహన ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. అడ్డగుట్టలో వదిలితే ఎవరినీ అడ్రస్ అడగకుండా ఇంటికి వెళ్లగలడా? అని ప్రశ్నించాడు. కేసిఆర్కు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది స్వర్గీయ ఎన్టిఆర్ అయితే మంత్రి పదవి ఇచ్చి నాయకుడిన చేసింది బాబు అన్నారు.
టిడిపి పుట్టింది హైదారాబాద్లోనే అని, వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే టిడిపి, బిజెపి మిత్రపక్షాల అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications