కాంగ్రెస్లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు, కేసీఆర్! దమ్ముంటే వారిని ఆపు: రేవంత్ రెడ్డి
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల గడువు ముగిసే నాటికి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, ముఖ్యమంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దమ్ముంటే ఆ చేరికను ఆపాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఆయన బుధవారం కొడంగల్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మాట్లాడారు.
నాకు మంత్రి పదవే ఎక్కువ: సీఎం పదవిపై కేటీఆర్
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి, పుట్టబోయే ప్రతి బిడ్డ పైన రూ.50వేల అప్పును భారంగా వేశారని మండిపడ్డారు. తన నివాసానికి, జల్సాలకు 150 గదుల ఇంటిని ప్రగతి భవన్ పేరిట నిర్మించుకున్నారని, ఈ ఇంటికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసారని ఆరోపించారు. తెలంగాణ కోసం పన్నెండు వందల మందికి పైగా యువత బలిదానం చేసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు.
కేసీఆర్కు దానికే సమయం సరిపోవట్లేదు
కవితకు, కేటీఆర్కు ఆస్తి పంచడం తప్ప కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీష్ రావులకు మధ్య ఆస్తి పంపకాలు జరిపేందుకే ఆయనకు సమయం సరిపోవడం లేదని విమర్శించారు. మొత్తం 63 మంది ఎమ్మెల్యేలతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్, ఆ తర్వాత చాలామందిని కొనుగోలు చేశారన్నారు. ఇంత చేసి కనీసం అయిదేళ్లు పాలించలేకపోయారన్నారు.
కేసీఆర్! కొడంగల్ నుంచి పోటీ చేసే దమ్ముందా
కేసీఆర్కు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలని రేవంత్ సవాల్ చేశారు. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉందని, కాబట్టి కేసీఆర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని చెప్పారు. పట్నం సోదరులు తనను ఏమీ చేయలేరన్నారు. తాను ఏనాడూ కొడంగల్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదని చెప్పారు. అందుకే ఈసారి కూడా భారీ మెజార్టీతో కచ్చితంగా గెలుస్తానని చెప్పారు.
చింతమడక చిట్టాకు, కొడంగల్ పౌరుషానికి మధ్య పోటీ
సిద్దిపేట నుంచి తెలంగాణను పాలించవచ్చు కానీ కొడంగల్ నుంచి పాలించవద్దా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చింతమడక చిట్టాకు, కొడంగల్ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయని చెప్పారు. తాండూరు సంతలో పట్టుకొచ్చిన పట్నం సోదరులకు, తనకు మధ్య పోటీ కాదని చెప్పారు. 14 ఏళ్ల పాటు కేసీఆర్ తన ప్రసంగాలతో 1200 మందిని బలి తీసుకున్నారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం నుంచి కానీ, ఆయన సామాజిక వర్గం నుంచి కానీ ఒక్కరైనా ఆత్మబలిదానం చేశారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ వద్ద పౌరుషం తాకట్టు
ఈ ప్రాంత ప్రజలు గుర్నాథ్ రెడ్డిని ఐదుసార్లు గెలిపిస్తే ఆయన కొడంగల్ పౌరుషాన్ని కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారన్నారు. తనను ఓడించేందుకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బు అంతా వృథా అయినట్లే అన్నారు. తన నియోజకవర్గం ప్రజలు తన వెంటే అన్నారు.
ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్లోకి వస్తారని చెప్పడంపై
కాగా, త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి ఇద్దరు ఎంపీలు వస్తారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెరాస ఎంపీలు స్పందించారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నంచారు. ఇద్దరు ఎంపీలు తెరాస నుంచి కాంగ్రెస్లో చేరుతారట కదా అంటే.. ఇద్దరు కాదు ముగ్గురు అని సెటైర్ వేశారని తెలుస్తోంది. అయితే అతను ఆ మాటను విసుగుతో అన్నారని సమాచారం.