పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారు: కేసీఆర్పై రేవంత్ విమర్శలు
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధిపత్య పోరులో సర్పంచ్ లు సమిధలు అవుతున్నారన్నారు. సర్పంచ్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ధర్నాకు పిలుపునిచ్చామన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ధర్నా చౌక్లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ పేరుతో టీపీసీసీ ధర్నాకు పిలుపునిచ్చింది.
అయితే, ధర్నాకు అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ వ్యవస్థలను, పంచాయతీరాజ్ సంస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. గుత్తాధిపత్యంగా అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు.
గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ఇవ్వాల్సిన నిధులను ఒక్కరోజు కూడా ఆలస్యం చేయబోమని అసెంబ్లీలో చెప్పి.. గ్రామ సర్పంచ్ లకు చెందాల్సిన దాదాపు రూ. 35వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిందని రేవంత్ ఆరోపించారు. ఇది చట్ట విరుద్ధమని, నియమ నిబంధనలను ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని రేవంత్ ధ్వజమెత్తారు.
నిధులను విడుదల చేయకుండా గ్రామ పంచాయతీ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రేవంత్ మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు పెండింగ్ లో ఉండటంతో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ అవినీతి, అహంకారంతో రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందని మండిపడ్డారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్న సర్కారుపై పోరాటం చేయాలని సర్పంచ్ లకు పిలుపునిచ్చారు. మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నారు. పంచాయతీలకు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.