మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడించిండి: తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
నల్గొండ: మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీకి ద్రోహం చేసినవారికి ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గతంలో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ ను రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారని.. అప్పుడు వారి త్యాగాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు రేవంత్. మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా గంటలో దామోదర్ రెడ్డి వస్తారని, రెండు గంటల్లో తాను వస్తానని రేవంత్ తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే మనకు తెలంగాణ తల్లి అని అన్నారు రేవంత్. రాష్ట్రం ఇచ్చిన తర్వాత అధికారంలోకి రాకున్నా చింతించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేకే మూసేసిన నేషనల్ హెరాల్డ్ కేసును తెరిచారని.. అన్యాయంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులిచ్చారన్నారు. ఈడీతో విచారణ జరుపుతున్నారన్నారు. కన్నతల్లిని అవమానిస్తుంటే తట్టుకోలమా? సోనియా గాంధీకి అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సోనియాగాంధీని ఈడీ విచారణ జరుపుతుంటే.. రాజగోపాల్ రెడ్డి అమిత్ షా దగ్గరకు వెళ్లారు. కాంగ్రెస్ పోరాటంలో కలిసి రాలేదు. కానీ, కాంట్రాక్టుల కోసం అమిత్ షా దగ్గరకు వెళ్లారు. ఒక్క ఎమ్మెల్యే పోయినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశానంటున్న రాజగోపాల్ రెడ్డి.. కేంద్రం నుంచి నిధులు చేస్తారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నెల రోజులు జైల్లో ఉన్న తనతో కలిసి ఉండలేనంటున్న రాజగోపాల్ రెడ్డి.. 90 రోజులు జైల్లో ఉన్న అమిత్ షాతో ఎలా కలిసి పనిచేస్తావు? అని నిలదీశారు.
2014 తర్వాత టీఆర్ఎస్ తనపై 120 కేసులు పెట్టిందన్నారు. అయినా తాను భయపడలేదన్నారు. కేసీఆర్ ను గద్దె దించేవరకూ పోరాటం చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి పార్టీని వీడారని.. నీచ్.. కమీనే.. అంటూ రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించాలన్నారు. మోసం చేసిన రాజగోపాల్ రెడ్డిని పాతిపెట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు కూడా రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.