కేసీఆర్ దెయ్యం వదలాలంటే.. ప్రతిపక్షాలు ఏకం కావాల్సిందే : రేవంత్
హైదరాబాద్ : తెలంగాణ రైతులకు భరోసానిచ్చేందుకు గాను టీడీపీ నేతలు చేపట్టిన 'రైతు పోరుబాట'పై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో టీడీపీని ఎద్దేవా చేస్తూ.. మిడతల దండు అంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ను చీల్చి చింత చెట్టుకు కట్టాలన్నా, కేసీఆర్ కు పట్టిన దయ్యాన్ని చింత బరిగెతో వదిలించాలన్నా ప్రతిపక్షాలన్నీఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు రేవంత్.
టీడీపీది మిడతల దండు కాదని రైతులకు అండగా ఉండే రామదండు అని రేవంత్ స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం కానంతవరకు తమ రామదండు పోరాటం ఆగబోదని రేవంత్ సహా టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. ఇక గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిల అమలులో జరుగుతున్న జాప్యంపై రేవంత్ మండిపడ్డారు.

డబుల్ బెడ్ రూమ్ లు, దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల హామిలు ఏమైపోయాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరిట తెలంగాణను దోచుకునేందుకే టీఆర్ఎస్ నేతలు ఎగబడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చోటు చేసుకుంటుంటే, కనీసం వారి కన్నీటిని తుడిచే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయడం లేదని విమర్శించారు. ఏక కాలంలో రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద రూ. 17 వేల కోట్లు కరువయ్యాయా? అంటూ నిలదీశారు. మొత్తానికి టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్ని ఏకం కావాలంటున్న రేవంత్ వ్యాఖ్యలపై మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయో? వేచి చూడాలి.












Click it and Unblock the Notifications