ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు: నేతలు పార్టీ వీడటంపై రేవంత్రెడ్డి ఆవేదన
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. బడుగుల కోసం ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిని తెలంగాణలో లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కూకట్పల్లి టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీని నిలబెట్టే బాధ్యత తనకు అప్పగించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Also Read: పైయెత్తు: చంద్రబాబు వ్యూహానికి జగన్ విరుగుడు?
బలహీనవర్గాల కోసం పోరాడాలని టీడీపీ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు వివేక్, రాజేందర్రెడ్డిలు టిఆర్ఎస్ పార్టీలో చేరిన రోజు తనకు నిద్ర పట్టలేదని రేవంత్ రెడ్డి చెప్పారు.
వివేక్, రాజేందర్రెడ్డి 25ఏళ్లు ప్రజాసేవలో తనతో కలిసి నడుస్తారని అనుకున్నట్లు చెప్పారు. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అని బాధపడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో యువతకు సీట్లు ఇప్పించే బాధ్యత తనదేనని కార్యకర్తలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర చేద్దామని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
దోచుకుంటున్నారు: దాసోజు శ్రవణ్
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జీవోలు దాస్తున్నారంటే దోచుకుంటున్నారనే అర్థమని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రహస్య జీవోలతో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు.
ప్రజలు ప్రశ్నిస్తారనే జీవోలను బహిర్గతం చేయడం లేదని ఆయన అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే గవర్నర్ మౌనం పాటిస్తున్నారని చెప్పారు. స.హ.చట్టం ప్రకారం అన్ని జీవోలు వెబ్సైట్లో పెట్టాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.