టాయిలెట్లు కడిగించారు,అన్నం పెట్టమంటే కాళ్లు మొక్కించుకున్నారు-ఆ గిరిజన మహిళల ఆవేదనపై కేసీఆర్కు రేవంత్ లేఖ
ఖమ్మం జిల్లాలో 20 మంది గిరిజన మహిళలను,పసిపిల్లల తల్లులను పోడు భూముల విషయంలో అరెస్ట్ చేయడం సమాజానికి సిగ్గుచేటని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ గిరిజన మహిళల పట్ల జైలు సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారని... మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17 లోగా రాష్ట్రంలోని పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
ఇలాంటి ఘటనల్ని కాంగ్రెస్ ఉపేక్షించదు : రేవంత్ రెడ్డి
పోడు భూముల వివాదంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో 20 మంది గిరిజన మహిళలు,పసిపిల్లల తల్లులను అరెస్ట్ చేసి... వారి పట్ల అమానవీయంగా వ్యవహరించారని రేవంత్ మండిపడ్డారు. జైల్లో అన్నం పెట్టమంటే జైలు సిబ్బంది తమతో కాళ్లు మొక్కించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మహిళలనే మానవతా దృక్పథం లేకుండా బూతులు తిడుతూ కర్రలతో వారిని కొట్టారని ఆరోపించారు. వారితో టాయిలెట్లు కూడా శుభ్రం చేయించారని... ఇక్కడ చంపేసినా అడిగే దిక్కులేదంటూ బెదిరించారని వారు చెప్పారన్నారు. ఇలాంటి మానవత్వం లేని ఘటనలు కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం ఉపేక్షించదని అన్నారు.
ప్రతీ దళిత,గిరిజనులకు రూ.10లక్షలు ఇవ్వాలి : రేవంత్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు.గిరిజనులు, ఆదివాసీలు, దళితుల పట్ల మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. వారికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా... అనేక సందర్భాల్లో వారి హక్కులను కాలరాస్తున్నారు. నేరేళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్నారని దళిత యువత పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. మిర్చీకి మద్దతు ధర అడిగిన పాపానికి ఖమ్మంలో గిరిజన రైతుల చేతులకు బేడీలు వేయించి, దొంగల్లా వారిని నడిరోడ్డు పై నడిపించి అవమానించారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల్లో సైతం దళితులనే ఎక్కువగా టార్గెట్ చేశారన్నారు. ఇటీవలి కాలంలో పోడు భూముల అంశంలో ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ లాంటి జిల్లాల్లో గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
దళిత,గిరిజనులను మోసం చేసిన సర్కార్ : రేవంత్
దళితలకు మూడెకరాల భూమి,గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు,బడ్జెట్లో వారికోసం ఏఢాదికి రూ.10వేల కోట్లు,పోడు భూములకు పట్టాలు.. ఇలా అన్నింటిలోనూ మోసం,దగా చేశారని ఆరోపించారు. గిరిజన, ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన ఐటీడీఏలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. తక్షణం వాటిని పునరుద్ధరించేందుకు నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకు దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరాలతో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ సర్కార్పై పోరును మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఖమ్మంలో గిరిజన మహిళల అరెస్టు...
రాష్ట్రంలో పోడు భూములకు సంబంధించి అధికారులకు,గిరిజన,ఆదివాసీలకు మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ సమస్యను పరిష్కరిస్తామని గతంలో పలుమార్లు చెప్పిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇటీవల ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ లో ఈ నెల 3న గిరిజన రైతులు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య పోడు భూములకు సంబంధించి గొడవ జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ లో భూమిని కొత్తగా పోడు చేయడంతో స్వాధీనం చేసుకునేందుకు వెళ్లామని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. అయితే పత్తి చేను పీకేస్తున్నందుకే వారిని అడ్డుకున్నామని గ్రామస్తులు అంటున్నారు. ఈ సందర్భంగా తమపై రాళ్లతో దాడి చేశారంటూ కొణిజర్ల పోలీసులకు అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు కేసు నమోదు కాగా, ఈ నెల 6న పోలీసులు 21 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఈ నెల 6న ఖమ్మం జిల్లా జైలుకు వారిని తరలించారు. వీరిలో మూడు నెలల బాలింత సహా 18 మంది మహిళలున్నారు. ముందుగా ఎఫ్ఐఆర్లో ఐపీసీ 307, 353, 148 రెడ్ విత్ 149 సెక్షన్లు పెట్టిన పోలీసులు, తర్వాత విమర్శలతో వెనక్కితగ్గారు. హత్యాయత్నం సెక్షన్లు 307, 148ని వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో జిల్లా న్యాయస్థానంలో గిరిజనులకు మంగళవారం(ఆగస్టు 9) బెయిల్ దొరికింది.
Recommended Video
'టాయిలెట్లు కడిగించారు.. అన్నం పెట్టమంటే కాళ్లు మొక్కించుకున్నారు..'
అరెస్టయిన గిరిజన మహిళలు ఆరు రోజుల తర్వాత బుధవారం బయటకు వచ్చారు. విడుదల సందర్భంగా వారి కుటుంబసభ్యులు ఉదయం నుంచే జైలు గేటు బయట ఎదురుచూశారు. ఉదయం 10 గంటలకు బయటకు వచ్చిన మహిళలు తమ కోసం ఊరి నుంచి వచ్చినవారిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. జైలు సిబ్బంది తమ పట్ల అమానవీయంగా ప్రవర్తించారని వాపోయారు. 20 బస్తాల బియ్యం బాగు చేయించారని, బాలింతను గదిలో పెట్టి బంధించారని, టాయిలెట్లు క్లీన్ చేయించారని చెప్పారు. అన్నం పెట్టమని అడిగితే ఓ మహిళా అధికారి తమతో కాళ్లు మొక్కించుకున్నారని, బూతులు తిడుతూ కర్రలతో కొట్టారని ఆరోపించారు. ఇక్కడే చంపేసినా అడిగే దిక్కు లేదంటూ బెదిరించారని, కొట్టిన విషయం బయటపెడితే బెయిల్ కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారని వాపోయారు. చర్లపల్లి జైలుకు పంపిస్తామని బెదిరించారని... బయటకు వచ్చాక మళ్లీ పోడు భూముల జోలికి పోవద్దని భయపెట్టారని చెప్పారు.టెర్రరిస్టులకు కూడా ఇలాంటి శిక్షలు ఉండవని అన్నారు.