ఇది వ్యూహాత్మకమేనా..’హస్తం’ పార్టీలో రేవంత్ చేరిక జాప్యం?
తెలంగాణలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో వేడి రగిలిస్తోంది. ఒకవైపు పార్టీలో సీనియర్ల ఎదురుదాడిని ఎదుర్కొంటూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీలో తనకు అనుకూల వాతావరణం కల
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్నేహ 'హస్తం' అందుకోవడం ఆలస్యమవుతుందా? వచ్చే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత దేశ రాజధాని హస్తిన వేదికగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైనట్లు మీడియాలో వార్తలొచ్చిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి పెరిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కూడా అయిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. రాజకీయంగా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే సమయం కోసం ఆయన వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు, కాంగ్రెస్ పార్టీలో నేతలందరి ఆమోదం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో 'హస్తం' పార్టీలో చేరే విషయమై తుది నిర్ణయం తీసుకోవడానికి రేవంత్ రెడ్డికి నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నదని సమాచారం. ఆయన సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో వచ్చేనెల రెండో వారం తర్వాతే లాంఛనంగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పరిస్థితులను బట్టి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. కాంగ్రెస్ పార్టీలో తన చేరిక చాలా సజావుగా, భారీ స్థాయిలో సాగాలని ఆయన భావిస్తున్నారు.

కాంగ్రెస్ నేతల మద్దతు కోసం రేవంత్ యత్నాలు
ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై దాడి చేసేందుకు టీడీపీ శాసనసభా పక్ష నేతగా రేవంత్ రెడ్డి తనకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకోనున్నారని సమాచారం. పార్టీల వ్యూహాల్లో మార్పులు, ఆత్మరక్షణ ధోరణులతో సంబంధం లేకుండా ప్రభుత్వంపై దాడి చేయడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నేతలు తమ అవకాశాలు కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారంతా రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ తాను వారి అవకాశాలను దెబ్బ తీయబోనని ఆయా సీనియర్ నేతలతో ప్రత్యేకించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, ఇతర జిల్లాల నాయకులతో ఆయన విడమరిచి చెప్పనున్నారని సమాచారం. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణతో సమావేశమై ప్రస్తుత పరిస్థితుల్లో తన నిర్ణయాన్ని తెలియజేయడంతోపాటు ఆమె ఆశీస్సులు కోరారని వార్తలు వచ్చాయి.

అభిప్రాయం వెల్లడికి నిరాకరించిన కోమటిరెడ్డి
డీకే అరుణతో మాదిరిగానే పార్టీలోని ఇతర సీనియర్లు ప్రత్యేకించి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుల వంటి వారి ఆశీస్సులు పొందిన తర్వాతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని బయటపెట్టడం ఆయనకు మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కానీ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా దాదాపు ఇటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. కానీ రేవంత్ రెడ్డి చేరికపై తన అభిప్రాయమేమీ కోరలేదని, తనకు సమాచారం లేదని కోమటి రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరికపై తన అభిప్రాయం చెప్పడానికి కూడా కోమటిరెడ్డి నిరాకరించారు.

తక్షణం చేరాలని కోరుతున్న కాంగ్రెస్ యూత్ బ్రిగేడ్
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన విషయమై రేవంత్ రెడ్డి టీటీడీపీలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్ వంటి సీనియర్ నేతలు ఆయన్ను గట్టిగా నిలదీశారని సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పనిచేస్తానని విడివిడిగా కలిసి రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన రాకను స్వాగతించిన సీనియర్ నేతలు వీ హన్మంతరావు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులతోనూ ఆయన సమావేశం కానున్నారని సమాచారం. ఒక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరికకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా మద్దతునిస్తున్నారు. ఈ విషయమై పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయాలను ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇప్పటికే తెలియజేశారని సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలోని యూత్ బ్రిగేడ్ తక్షణం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆకాంక్షిస్తున్నదని వినికిడి. మరోవైపు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాలూసింగ్ నాయక్ వంటి వారు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారని సమాచారం.












Click it and Unblock the Notifications