Telangana: ధరణి సమస్యలు పరిష్కరిస్తాం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్ల షామీర్ పేటలోని నల్సార్ యూనివర్శిటీలో తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం రూపొందించిన ధరణితో అన్నదాతలు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి బాధలు లేకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.
తహశీల్దార్లకు గ్రామీణ ప్రజలకు ఎలా సర్వీస్ చేయాలో తెలుసని.. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తహశీల్దార్ ఆఫీస్ లో ఎలాంటి వసతులు లేకుండా ఉండేవని గుర్తు చేశారు. తహశీల్దార్లకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పేదవారిని ఇబ్బంది పెట్టకుండా.. వారికి కావల్సిన పని చేస్తే అధికారులతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని వివరించారు. అయితే కొంత మంది అధికారుల వల్ల వ్యవస్థకే బ్యాడ్ నేమ్ వస్తుందన్నారు.

జిల్లా పాలనాధికారి అనుమతి లేకుండా తహశీల్దార్ పై కేసు పెట్టకుండా ఆదేశిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న తహశీల్దార్లలో 90 శాతం మంది రైతు కుటుంబం నుంచే వచ్చారని.. వారికి అన్నదాతల బాధ తెలుసని.. అందుకే వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా రైతులకు పని చేయాలని సూచించారు. కాగా అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఇదివరకే ప్రకటించారు. త్వరలో దరఖాస్తులు స్వీకరించి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది.
కాగా రాష్ట్రంలో చాలా మంది కొంత రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రజా పాలనలో దరఖాస్తులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ దరఖాస్తులు ఎక్కడున్నాయి. వాటిని ప్రాసెస్ చేశారా అనేది తెలియలేదు. మరోవైపు రైతు రుణ మాఫీ కూడా అందరికి కాలేదు. దీంతో రైతులు కూడా రుణ మాఫీ పూర్తి చేయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications