తెలంగాణ పునర్నిర్మాణం మీమీదే..
తెలంగాణలో రైతులకు అండగా ఉంటూ వారికి సంబంధించిన భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన బాధ్యత లైసెన్స్డ్ సర్వేయర్లపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లైసెన్స్ పొందిన ప్రతి సర్వేయర్ కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాము కావాలని పిలుపునిచ్చారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యం చేరుకోవడానికి సహకారించాలని కోరారు.
శిక్షణ పొందిన ల్యాండ్ సర్వేయర్లకు రేవంత్ రెడ్డి లైసెన్స్ లను అందజేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. సర్వేయర్లు ఎప్పుడూ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, రైతు.. రాజు కావాలంటే సర్వేయర్లు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలని సూచించారు.

రైతుకు అన్యాయం చేస్తే మన కుటుంబ సభ్యులకు అన్యాయం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. సర్వేయర్లు కష్టపడితే తెలంగాణకు మంచి పేరు వస్తుందని, ఆ బాధ్యత భుజస్కందాలపై పెట్టామని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన కోటి 60 లక్షల ఎకరాల భూములు యజమానుల వద్ద ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 140 సంవత్సరాలుగా వివిధ చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ భూ యాజమాన్య సమస్యలకు ఇంకా పరిష్కారం లభించట్లేదని, సరిహద్దుల విషయంలో ఏ రైతు కూడా పరిష్కారం కాకుండా ఇబ్బంది పడకూడదని అన్నారు.
తెలంగాణ ప్రజలకు కన్న తల్లిపై ఎంత మమకారం చూపిస్తారో.. భూమి మీదా అంతే మమకారాన్ని చూపిస్తారని, భూ యజమానుల సరిహద్దులను పరిరక్షించే బాధ్యత ల్యాండ్ సర్వేయర్లపై ఉందని అన్నారు. దేశంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి సహకరించాలని కోరారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యం చేరుకోవడానికి సహకరించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications