వర్మా! ఏంటీ ‘జీఎస్టీ’?: పోలీసుల ప్రశ్నల వర్షం, ఇవే!, ‘పోలీస్’నవుతానంటూ ట్వీట్
హైదరాబాద్: ఇటీవల సంచలనాలకు తెరతీసిన 'జీఎస్టీ' వెబ్ సిరీస్కు సంబంధించిన కేసులో వివాదాస్పద సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారించారు. ఆయన ల్యాప్టాప్ సీజ్ చేశారు. మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
కాగా, తదుపరి విచారణకు శుక్రవారం రావాలని నోటీసు జారీ చేసినట్లు సమాచారం. సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మను విచారణకు పిలిచిన పోలీసులు.. శనివారం సుమారు 4గంటలపాటు విచారించారు.
కాన్సెప్ట్ మాత్రమేనంటూ వర్మ
అయితే, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వర్మ.. జీఎస్టీ సినిమాకు కాన్సెప్ట్ మాత్రమే తాను ఇచ్చానని, సినిమా తాను రిలీజ్ చేయలేదని, డైరెక్ట్ చేయలేదని చెప్పినట్టు అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ వ్యవహారంలో కొన్ని సాంకేతిక అంశాలను ఆయన నుంచి సేకరించినట్టు తెలిపారు.
పోలాండ్, యూకేలలో షూటింగ్..
పోలాండ్, యూకేలలో జీఎస్టీ చిత్రీకరణ జరిగిందని వర్మ చెప్పాడని, ఆయా దేశాలకు వర్మ వెళ్లడంపైనా విచారణ చేస్తున్నట్టు అదనపు డీసీపీ తెలిపారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వర్మ సమయం కోరాడన్నారు.
భారీ భద్రత
రామ్గోపాల్ వర్మ తీసిన ఈ చిత్రంపై ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చలో తనను దూషించారంటూ దేవి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వర్మ కేసు విచారణ నేపథ్యంలో సీసీఎస్ పోలీస్టేషన్ వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
సూటిగా చెప్పని వర్మ
కాగా, విచారణ సమయంలో సైబర్ క్రైం అధికారులకు రామ్గోపాల్ వర్మ సూటిగా సమాధానం చెప్పకుండా ఇబ్బందికి గురిచేసినట్లు తెలిసింది. వర్మ తీరుతో విసుగెత్తిన అధికారులు మరోసారి(వచ్చే శుక్రవారం) విచారించాలని నిర్ణయం తీసుకున్నారు.
కించపర్చారంటూ వర్మపై రెండు కేసులు
సీసీఎస్లో శనివారం 12 గంటలకు మొదలైన వర్మ విచారణ సుదీర్ఘంగా సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగింది. జీఎస్టీ వెబ్ సిరీస్తో దుమారం రేపిన వర్మ ఆ సమయంలో సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యాలు చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. అశ్లీలతతో పాటు మహిళలను కించపర్చారంటూ వర్మపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు పలు మహిళా సంఘాలతో పాటు దేవీ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వర్మపై సీసీఎస్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఐటీ చట్టం, ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద నమోదైన రెండు కేసుల విషయంలో వర్మపై సీసీఎస్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.
వర్మపై సంధించిన ప్రశ్నలివే..
వర్మను సీసీఎస్ పోలీసులు అడిగిన ప్రశ్నలు దాదాపు ఇలా వున్నాయి.. జీఎస్టీని ఎందుకు తీశారు?, విశాఖ మహిళపై ఎందుకు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు?, దేవితో పోర్న్ సినిమా తీస్తానన్నారా? లేదా?, మీ ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేసిన మాల్కోవా ఫొటోలు ఎక్కడివి?, విదేశాల్లో తీసినంత మాత్రాన భారతీయ చట్టాలకు ఈ సినిమా వర్తించదని ఎలా చెబుతారు?, ఐటీ చట్టం ప్రకారం మహిళలను అభ్యంతరకరంగా చూపడం నేరం కాదా?, జీఎస్టీని ఎంతకు అమ్మారు?, మాల్కోవాతో అభ్యంతర సన్నివేశాలు ఎలా తీశారు?.
‘పోలీస్'గా చేస్తా..
సీసీఎస్ పోలీసుల విచారణ అనంతరం రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు పోలీసు అధికారి పాత్రను పోషించాలని ఉందని, ఎవరైనా సినీ డైరెక్టర్లు కథ ఉంటే అవకాశం ఇవ్వాలని వర్మ కోరారు. దీనికి వెంటనే స్పందించిన పూరీ జగన్నాథ్.. స్క్రిప్ట్ రెడీగా ఉంది.. డేట్స్ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత థాంక్యూ సార్ అంటూ వర్మ రిప్లై ఇచ్చారు. అంతకుముందు సీసీఎస్ పోలీసులు ప్రొఫెషనలిజమ్ తనకు నచ్చిందని వ్యాఖ్యానించారు. ఫీలింగ్ ఎమేజింగ్, హ్యాపీ అంటూ ట్వీట్ చేశారు.