ఎత్తేశారు: బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ, లబోదిబోమంటున్న ఉద్యోగులు..
డబ్బులు పోగొట్టుకున్న ఉద్యోగులంతా పోలీసులను ఆశ్రయించి న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. చెప్పా పెట్టకుండా.. కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా కంపెనీ మూసేయడంతో.. ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు.
ఐటీకి ఏమైంది?: కెరీర్పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..
డిపాజిట్లు కట్టి మరీ ఉద్యోగాల్లో చేరితే.. ఆరు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. రేపు మాపు అంటూ కాలాయాపన చేస్తూ వచ్చి.. తీరా ఇప్పుడు కంపెనీనే ఎత్తేశారని, ఇప్పుడు మా పరిస్థితేంటని వాపోతున్నారు.
రిచీస్ ఐటీ ఇన్ఫోటెక్:
గచ్చిబౌలిలోని సౌత్ఇండియా షాపింగ్ మాల్ భవనంలోని నాలుగో అంతస్తులో రిచీస్ ఐటీ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఆరు నెలల నుంచి నడుస్తోంది. అబ్దుల్ వసీమ్ అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నారు. కంపెనీల ఉద్యోగాల నిమిత్తం 25మంది నుంచి వద్ద డిపాజిట్లు వసూలు చేశాడు. మొత్తం 47మందిని కంపెనీలో నియమించుకున్నాడు.
ఒక్కొక్కరు రూ.60వేలు:
కంపెనీలో ఉద్యోగం నిమిత్తం ఫ్రెషర్స్ నుంచి అబ్దుల్ వసీమ్ రూ.60వేలు డిపాజిట్ కింద వసూలు చేశాడు. అలా 25మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన వసీమ్.. వారితో పాటు మరో 22మంది సీనియర్లను నియమించుకున్నాడు. సీనియర్ ఉద్యోగులకు ఒక నెల జీతం మాత్రమే ఇచ్చిన కంపెనీ.. ఫ్రెషర్స్ కు మాత్రం ఆరు నెలల నుంచి జీతాలే ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా.. రేపు మాపు అంటూ దాటవేస్తూ వస్తున్నాడు.
చెక్కులు బౌన్స్:
జీతం కోసం ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతో అగస్టు 1న కొంతమంది ఉద్యోగులకు 15వ తేదీతో వేసిన చెక్కులను ఇచ్చాడు. అయితే ఈ చెక్కులు బౌన్స్ కావడంతో.. కంపెనీ నిర్వాహకుడు వసీమ్ను ఉద్యోగులు నిలదీశారు. దీంతో వారం రోజుల నుంచి కనిపించకుండా పోయాడు.
ఆఫీసుకు వెళ్తే.. అద్దె చెల్లించలేదన్న కారణంతో కార్యాలయానికి తాళం వేశామని కాంప్లెక్స్ నిర్వాహకులు తెలిపారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఉద్యోగులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. అయితే సోమవారం పోలీసు అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో.. మంగళవారం రావాల్సిందిగా ఇన్స్పెక్టర్ గంగాధర్ చెప్పినట్లు పేర్కొన్నారు.