ఆ జిల్లాలో హెల్మెట్ ధరించిన మహిళలకు.. చీరలు పంపిణీ..
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. వీరిలో సుమారు 16 మంది అతివేగం కారణంగానే మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 80 శాతానికి పైగా రోడ్డు ప్రమాద మరణాలకు కారణం ఇదేనని స్పష్టం అవుతోంది. తెలంగాణలో 2024లో రోజుకు సగటున 71 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో, 2025 మొదటి ఆరు నెలల్లో 1,822 ప్రమాదాలు జరిగాయి, 363 మంది మరణించారు. 1,657 మంది గాయపడ్డారు. ఇక హెల్మెట్ లేకుండా వాహనం నడిపే సమయంలో పొరపాటున ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.
ఈ క్రమంలోనే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనం నడిపేవారు ఎవరైనా కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారికి బండితోపాటు 2 హెల్మెట్లు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఇటీవల హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ట్రాఫిక్ పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాక హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసిన వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపిన మహిళలకు ట్రాఫిక్ పోలీసులు చీరలు పంపిణీ చేశారు. రామగుండం ట్రాఫిక్ పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల అకస్మాత్తుగా ప్రమాదం సంభవించినా తలకు ఎలాంటి గాయం కాకుండా ప్రాణాలను నిలుపుకోవచ్చని తెలిపారు.

ఇక మధ్య ప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఇటీవల నో హెల్మెట్.. నో పెట్రోల్ రూల్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి ఈ నిబంధన జిల్లాలో అమలు అవుతోంది.












Click it and Unblock the Notifications