రాజకీయాల్లో మచ్చలేని యోధుడు.!రోశయ్య మరణం తెలుగువారికి తీరని లోటన్న పవన్ కళ్యాణ్.!
అమరావతి/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కే. రోశయ్య మరణం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోశయ్య రాజకీయ స్నేహితులే కాకుండా ప్రతిపక్షనాయకులు సైతం రోశయ్య మరణాన్ని జీర్నించుకోలేక పోతున్నారు. రోశయ్య మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నిష్కళంక రాజకీయయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయంగా ఎనలేని సేవలు అందించిన సీనియర్ రాజకీయ వేత్త కొణజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.
అలుపెరగని బాటసారి..
సుధీర్ఘ రాజకీయ బాటసారి మరణం కలిచివేసిందని పవన్ అభిప్రాపడ్డారు. తనకు సన్నిహిత సంబంధాలు ఉన్న రోశయ్య మరణం తనను తీరని శోకానికి, వేదనకు గురి చేసిందని, జనసేన పార్టీని స్థాపించిన తరువాత రెండు మూడుసార్లు కలిసినప్పుడు ఆయన తనకు ఎన్నో విలువైన సలహాలు అందించి, ఎంతో అభిమానం చూపించారని, వవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. రాజకీయ రంగంలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే 1968లో శాసనమండలి సభ్యునిగా ఎంపికైన నాటి నుండి ఆయన నిరంతరంగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూనే వున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.
15సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు..
ఒకసారి శాసనసభకు మరోసారి పార్లమెంటుకు ఎన్నికై మూడు సభలలోను తనదైన శైలితో ప్రత్యేకతను చాటుకున్నారని, 1972లో మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టి ఎంత మంది ముఖ్యమంత్రులు మారినా మంత్రిమండలిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలపై విశేషానుభవం ఉన్న రోశయ్య 15సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించడం ఆయన ప్రతిభకు నిదర్శనమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
క్లిష్ట సమయంలో ఉమ్మడి ఏపికి సీఎం గా బాద్యతలు..
రోశయ్య అపార రాజకీయ అనుభవం, ఆయనలోని విధేయత, ఆయనను ముఖ్యమంత్రిగా నిలిపిందని అన్నారు. ఆపత్కాల సమయంలో 14 నెలలపాటు రోశయ్య ముఖ్యమంత్రిగా సేవలు అందించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసారు. పాలనాపరంగా ఆయన చూపిన విజ్ఞత, వ్యవహారశైలిని తెలుగు ప్రజలు మరచిపోలేరన్నారు పవన్. ఆ తర్వాత పొరుగు రాష్ట్రం తమిళనాడు గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి తమిళ ప్రజల ఆదరాభిమానాలను పొందడం ఆయనలోని విశాల దృక్పథానికి నిదర్శనమన్నారు పవన్ కళ్యాణ్.
హాస్యాన్ని పండించడంలో రోశయ్య తర్వాతే ఎవరైనా..
రోశయ్యలోని వాక్పటిమ, చాతుర్యం ఆయనను ఒక విలక్షణ రాజకీయవేత్తగా నిలిపాయని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఉన్నత పదవులలో కొనసాగినా వేలెత్తి చూపలేని పాలన ఆయన సొంతం చేసుకున్నారని, నీతి నిజాయతీలతో రాజకీయ ప్రస్థానాన్ని ముగించిన రోశయ్య నేటి పాలకులకు నిస్సందేహంగా ఆదర్శప్రాయులని, రోశయ్య మృతికి తన తరపున, జనసేన తరపున సంతాపం తెలుపుతున్నట్టు పవన్ ప్రకటించారు. రోశయ్య కుటుంబానికి తన సానుభూతి తెలియచేస్తున్నానని, ఈ దుఃఖ సమయంలో వారికి భగవంతుడు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు.