హరీశ్ సాధించారు: తెలంగాణ 11ప్రాజెక్టులకు కేంద్ర నిధులు రూ.6,700 కోట్లు
న్యూఢిల్లీ: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తన ఢిల్లీ పర్యటనలో మంచి ఫలితాలు సాధించారు. తెలంగాణలోని 11 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం రూ.6700 కోట్ల మేరకు ఆర్థిక సాయం అందించాలని కోరగా.. కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో తెలంగాణలో నిర్మాణంలో ఉన్న 11 ప్రాజెక్టులు పూర్తిచేయటానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి అందనున్నాయి.
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(పీఎంఎస్కేవై) కింద ప్రాధాన్యంగా పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో వీటికి చోటుదక్కింది. ఈ ప్రాజెక్టులకు పీఎంఎస్కేవైలో చోటు లభించేలా చేయడానికి, మంత్రి హరీశ్రావు కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖపై గట్టి ఒత్తిడి తేవటం ఫలితాన్నిచ్చింది.
ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి తీసుకోవాల్సిన చర్యలు, నిధులు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కొన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులతో ఉపసంఘం ఏర్పాటుచేసింది. అందులో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ సభ్యులుగా ఉన్నారు.
కాగా, ఢిల్లీలో బుధవారం సమావేశమైన ఈ ఉపసంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటివల్ల తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు గ్రాంటు, రుణ రూపేణా లభిస్తాయని భేటీ అనంతరం మంత్రి హరీశ్రావు మీడియాకు తెలిపారు. అంచనా వ్యయం 200శాతం పెరిగిన ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల సంఘం పునఃపరిశీలించాలని తీర్మానించామన్నారు.

ప్రాధాన్య క్రమంలోని ప్రాజెక్టులివీ..:
తెలంగాణ నుంచి చోటు లభించిన ప్రాజెక్టుల్లో దేవాదుల, భీమా, శ్రీరాంసాగర్ రెండోదశ, శ్రీరాంసాగర్ వరదకాలువ, కొమురంభీం, నీల్వాయి, పెద్దవాగు జగన్నాథపురం, గాలివాగు, గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి గ్రాంటు రూపేణా రూ. 2155 కోట్లు అందనుండగా, నాబార్డు ద్వారా రూ.4631కోట్ల రుణం లభించనుంది.
నాబార్డు నేరుగా కాకుండా జాతీయ జల అభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రాలకు రుణం అందజేస్తుంది. వడ్డీ నామమాత్రంగా ఐదు నుంచి ఐదున్నర శాతం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం 15 సంవత్సరాల్లో ఈ రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మొదటి మూడేళ్లు వడ్డీ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. నాలుగో సంవత్సరం నుంచి అసలు చెల్లింపు మొదలవుతుంది.
రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే వడ్డీ ఉండదు. ఉదాహరణకు దేవాదుల ఎత్తిపోతల పథకానికి కేంద్రం నుంచి గ్రాంటుగా అందేది రూ.1143 కోట్లు కాగా, రూ.2500 కోట్లు రుణం. ఇలా ఇచ్చే రాష్ట్రాలకు ఇచ్చే రుణం ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టం పరిధిలోకి రాదు.
ఏఐబీపీ పరిధిలో ప్రయోజనాలు: సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద గుర్తింపు పొందిన ప్రాజెక్టులకు 2012 వరకు ఆమోదం పొందిన మొత్తం కంటే 20శాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. భూసేకరణ వ్యయం భారీగా పెరిగినందున దీనిని మాత్రం 2016 వరకు పెరిగిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రాలు ఒత్తిడి చేయడంతో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆమోదించింది.
ఇప్పటివరకు గిరిజన ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు కేంద్రం 90శాతం గ్రాంటు ఇచ్చేది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు కూడా దీనిని వర్తింపచేయాలని వచ్చిన డిమాండుకూ కేంద్రం అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ వాటాను 40శాతానికి బదులు 60శాతంగా తీసుకోవడం, దీనికి జిల్లాకు బదులు రాష్ట్రం మొత్తాన్ని యూనిట్గా తీసుకోవడం, చెరువుల మరమ్మతుకు యంత్రాల వినియోగానికి 60 శాతం చెల్లించడం మొదలైన వాటికి కూడా ఉపసంఘం ఆమోదించినట్లు తెలిసింది.

ఢిల్లీలో కేంద్ర మంత్రులతో హరీశ్ భేటీ:
ఉపసంఘ సమావేశానికి ముందు మంత్రి హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్సింగ్తో భేటీ అయ్యారు. గోదాముల నిర్మాణానికి రాయితీలు, శీతల గిడ్డంగులకు నిధులు కేటాయించాలని కోరారు.
అనంతరం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, టిఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్రెడ్డిలతో కలిసి కేంద్రమంత్రి హన్స్రాజ్ అహిర్తో సమావేశమయ్యారు హరీశ్ రావు. మహారాష్ట్ర, తెలంగాణల మధ్య నిర్మించే ప్రాజెక్టులపై చర్చించారు.
గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తుమ్మిడి హట్టి ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ట సానుకూలంగా ఉందని హరీశ్ వివరించారు. గోదావరి నదిపై తెలంగాణ నిర్మించనున్న ప్రాజెక్టులవల్ల మహారాష్ట్రలో ఎలాంటి ముంపు ఉండబోదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ స్పష్టంచేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications