tsrtc strike:కాసేపట్లో కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు, విలీనమే పీఠముడి..?
టీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్య చర్చలు జరపనుంది. ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చల ప్రక్రియ ప్రారంభమవుతుంది. చర్చల ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని ఆర్టీసీ యాజమాన్యం మీడియాకు తెలియజేసింది.
చర్చలు..
రవాణాశాఖ కార్యాలయంలో చర్చల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) సహా గుర్తింపు పొందిన సంఘాలను ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ జేఏసీ తరఫున కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్ తదితరులు హాజరుకానుండగా.. ఆర్టీసీ తరఫున ఆర్టీసీ ఈడీ, మంత్రి పువ్వాడ పాల్గొనే అవకాశం ఉంది.
సఫలమా... విఫలమా..
హైకోర్టు సూచనమేరకు కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. శుక్రవారం రాత్రి అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశానుసారం ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతుంది. ఇవాళ్టి చర్చలు సఫలం అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆర్టీసీ సమ్మె దాదాపు 20 రోజుల నుంచి చేయడం.. డిమాండ్లపై ప్రభుత్వం కఠినంగా ఉండటంతో మధ్యేమార్గంగా చర్చలు ఉంటాయని తెలుస్తోంది.
విలీనమే అడ్డంకి..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. విలీనం ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరో 57 కార్పొరేషన్ల సంగతి ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఐఆర్, పీఆర్ గురించి ప్రధానంగా కార్మికులు పట్టుబడుతున్నారు. కానీ ఇప్పటికే 64 శాతం ఇంక్రిమెంట్ చేశామని కేసీఆర్ చెబుతుండటంతో.. ఐఆర్, పీఆర్పై ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందా అనే అనుమానం తలెత్తుతుంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఆర్టీసీ ముగిసిన అధ్యాయం అని చెప్పడంతో.. కార్మికుల్లో చీలిక వచ్చే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఇరువురి మధ్య రాజీ మార్గమా..?
తమ డిమాండ్లకు సంబంధించి ఆమోదం తెలుపాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. అంతేకాదు రాతపూర్వకంగా హామీనివ్వాలని కోరుతున్నాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు, యాజమాన్యం మధ్య ఇదివరకు జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో డిమాండ్లపై ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తోందా ? లేదంటే ఆర్టీసీ కార్మిక సంఘాలు దిగి వస్తాయా అనే అంశం చర్చకు దారితీసింది.