తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులు బంద్.. ఆర్టీసీ సంచలన నిర్ణయం
తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. హై ఓల్టేజ్ బ్యాటరీ ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు యాజమాన్యం ప్రకటించింది. ఇటీవల జరిగిన ప్రమాదాలపై సరైన వివరణ, భరోసా ఇవ్వాలని జేబీఎం సంస్థను కోరినా స్పందన రాకపోవడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి భద్రతా ధ్రువీకరణ, సాంకేతిక నివేదికలు వచ్చిన తర్వాతే బస్సుల సేవలను పునరుద్ధరిస్తామని ఈ మేరకు అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల కరీంనగర్, వరంగల్ డిపో పరిధిలో బ్యాటరీ లీకేజీల వల్ల బస్సులు తగలబడిన ఘటనలు తెలిసిందే.
గత నెల జూన్ 21వ తేదీన ఉదయం సమయంలో కరీంనగర్ సమీపంలోని అలుగునూర్ వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదం మరువక ముందే.. రెండు రోజుల క్రితం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో నిలిపి ఉన్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా వరుస సంఘటనల దృష్ట్యా ప్రయాణీకులు, సిబ్బంది అలాగే ప్రజల ప్రాణాల రక్షణే అత్యంత ప్రాధాన్యతగా భావించి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక జేబీఎం సంస్థను ప్రమాదాల విశ్లేషణ నివేదిక.. శాశ్వత నివారణ చర్యలు.. అలాగే బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్.. పలు అంశాలపై స్పందించి తగిన నివేదిక సమర్పించాలని తెలంగాణ ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications