కేసీఆర్ వేసే ప్రతి అడుగు వెనుకా ఆ రాజకీయ వ్యూహకర్త?: మోడీ కార్యక్రమానికి డుమ్మా ఆయన సలహా?
హైదరాబాద్: తెలంగాణ ఇక ఎన్నికల సంవత్సరంలోకి అడుగు పెట్టినట్టే. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోందీ రాష్ట్రం. 2023 నవంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. అసెంబ్లీ ఎన్నికల మూడ్లోకి వెళ్లినట్టే కనిపిస్తోంది. సార్వత్రిక బడ్జెట్ విషయంలో మొన్నటికి మొన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై మాటల తూటాలను సంధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తాను ఎంత దూరంగా ఉన్నాననేది కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

జాతీయ రాజకీయాల వైపు
అదే వైఖరి, దూకుడును కొనసాగించనున్నారు. పూర్తి స్థాయి జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టే దిశగా అడుగులు వేయనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ.. కేసీఆర్ వేసే ప్రతి అడుగు ఇకపై జాతీయ రాజకీయాల వైపే ఉండబోతోందనే అంచనాలు ఉన్నాయి.

కేసీఆర్ లక్ష్యమేంటీ..
ప్రాంతీయ పార్టీలను ఏక తాటిపైకి తీసుకుని రావడం అనే విషయంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారనేది బహిరంగ రహస్యం. రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జార్ఖండ్ ముక్తిమోర్చా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వంటి ప్రధాన ప్రాంతీయ రాజకీయ పక్షాలన్నింటికీ జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలనేది ఆయన ఉద్దేశంగా భావిస్తున్నారు. వామపక్షాలను కూడా కలుపుకొని వెళ్లాలనేది ఆయన యోచనగా చెబుతున్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనపైనా దృష్టి సారించారు. త్వరలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలుసుకోనున్నారు.

ప్రశాంత్ కిశోర్తో..
ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను నియమించుకుందనే ప్రచారం సాగుతోంది. ఇదివరకే ఒకట్రెండు సార్లు ప్రశాంత్ కిశోర్.. కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిశారంటూ వార్తలొచ్చాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ సహకారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు. తన రాజకీయ వ్యూహాలు, చతురతకు ప్రశాంత్ కిశోర్ ఇచ్చే సలహాలు కూడా తోడైతే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నీ విజయాలే..
రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్కు మంచి సక్సెస్ ట్రాక్ ఉంది. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుకా ప్రశాంత్ కిశోర్, ఆయన టీమ్ ఐప్యాక్ ఉంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే అధికారంలో రావడం వెనుక ఆయన పాత్ర ఉందనేది తెలిసిన విషయమే. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ కోసం పని చేశారు.

ఐప్యాక్తో సమగ్ర ఒప్పందం..
తాజాగా ప్రశాంత్ కిశోర్కు చెందిన ఐప్యాక్తో టీఆర్ఎస్ ఓ ఒప్పందాన్ని కుదర్చుకుందని తెలుస్తోంది. 2023 చివరన జరిగే అసెంబ్లీ, 2024లో ఎదుర్కొనబోయే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి అవసరమైన సూచనలు, సలహాలు, వ్యూహాలను రూపొందించాల్సిన బాధ్యతను టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ప్రశాంత్ కిశోర్ చేతికి అప్పగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనికి అవసరమైన ఒప్పందాలను త్వరలోనే కుదుర్చుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

మోడీ కార్యక్రమానికి డుమ్మా కూడా..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండటానికి కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉందనే అభిప్రాయాలు తలెత్తుతున్నాయి. మోడీ వ్యక్తిగత పర్యటన కావడం వల్ల ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలకాల్సిన అవసరం లేదని, దీనికి ప్రొటోకాల్ వర్తించబోదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మోడీ పర్యటనకు దూరంగా ఉండటం వల్ల జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఓ బలమైన సందేశాన్ని పంపించినట్టవుతుందని టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications