పాపం సామా ..! బీ ఫామ్ ఇచ్చినా పోటీ చేసే యోగం లేకపాయె ..!!
హైదరాబాద్ : కూటమిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది. పొత్తులో భాగంగా 14సీట్లు చేజిక్కించుకుంటున్నప్పటికి 13 నియోజక వర్గాల్లో మాత్రమే పోటీకి దిగింది టీడిపి. తాజాగా మరో సీటును కోల్పోయే పరిస్థితులు తలెత్తడంతో 12 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మహాకూటమి అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డిని ఖరారు చేశారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని టీడీపీ కి కేటాయించారు. పార్టీ నిర్ణయం మేరకు సామ రంగారెడ్డి బలవంతంగా నామినేషన్ దాఖలు చేశారు. సామ రంగారెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి డి రంగారెడ్డి బలమైన అభ్యర్థి అని, ఆయనకే బీ ఫాం అందచేయాలని, మహాకూటమి అభ్యర్థిగా ప్రకటించాలని బుధవారం అర్థరాత్రి నిర్ణయం తీసుకున్నారు.
గురువారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తనకు ఇబ్రహీపట్నం బదులు ఎల్ బీ నగర్ టికెట్ కేటాయించాలని సామ రంగారెడ్డి ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను కలిసి విన్నవించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిన విషయం తెలిసిందే. బీ ఫాం ఎక్కడ ఇస్తే అక్కడే పోటీ చేయాలని చెప్పడంతో చేసేది లేక నామినేషన్ దాఖలు చేశారు.
అయితే నియోజకవర్గంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా, ఓటర్లను తన వైపునకు తిప్పుకునే దమ్ము మల్ రెడ్డి రంగారెడ్డికి మాత్రమే ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. మహాకూటమిలోని నాయకులు కూడా ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. కూటమి పెద్దలు పునరాలోచనలో పడ్డారు. గెలిచే సీటును చేజేతులారా పోగొట్టుకున్నామని భావించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కాగా మహా కూటమి తరపున మల్ రెడ్డి రంగారెడ్డిని అధికారికంగా ప్రకటించడంతో సామ రంగారెడ్డి పోటీ నుంచి విరమించుకోనున్నారు. అయితే ఒక సందర్భంలో మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్ రెడ్డి రాంరెడ్డి పేరును ఖరారు చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ వెనక్కి తగ్గారు. చివరకు మల్ రెడ్డి రంగారెడ్డి వైపై కూటమి పెద్దలు మొగ్గు చూపారు. దీంతో మరో సారి సామా రంగారెడ్డి రాజకీయ భవిశ్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నట్టైంది.