ఓటుకు నోటు కేసు: సండ్రకు ఏసీబీ కోర్టు సమన్లు
ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేసింది. మార్చి 31న వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని సండ్రను ఆదేశించింది.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేసింది. మార్చి 31న వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని సండ్రను ఆదేశించింది. ఈ వ్యవహారంలో సండ్ర పాత్రపై ఇటీవల ఏసీబీ దాఖలుచేసిన అనుబంధ అభియోగపత్రాన్ని ప్రత్యేక కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంది.
ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యేల డ్రైవర్లు, గన్మెన్లను ప్రశ్నించిన ఏసీబీ, వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేంనరేందర్రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్, డ్రైవరు కుమారయ్య, వేం నరేందర్రెడ్డి భూముల వ్యవహారాలను పర్యవేక్షించే కె.వీరభద్రరావుల నుంచీ వివరాలు సేకరించింది.

మరోవైపు, సుమారు 99 ట్రాన్స్స్క్రిప్షన్లను పరిగణనలోకి తీసుకుని, వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపింది. ఆడియో టేప్లను పరిశీలించి, ఫోన్ సంభాషణల్లో ఎలాంటి అతుకులూ లేవని ఆ సంస్థ నివేదిక ఇచ్చినట్లు ఏసీబీ తెలిపింది. 66 పేజీల అనుబంధ అభియోగపత్రంతోపాటు, వాంగ్మూలాలతో కూడిన 25 పేజీల డాక్యుమెంట్లనూ కోర్టుకు సమర్పించింది.
ఇందులో ఫోన్ సంభాషణలనే ఎక్కువగా ప్రస్తావిస్తూ, 2015 మే 30న సమావేశం అనంతరం ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేచినట్లు పేర్కొంది. మొదటి అభియోగపత్రంలో రేవంత్రెడ్డి, బిషప్ సెబాస్టియన్, రుద్ర ఉదయ్సింహ, జెరూ సలేం మత్తయ్యలను నిందితులుగా పేర్కొంది. మొత్తం కాల్స్ 2015, మే29, 30, 31తేదీల్లో ఉన్నాయని, ఇందులోనే స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు సంభాషణల్లో రికార్డయ్యిందని తెలిపింది.
కాగా, అనుబంధ అభియోగపత్రంలో సండ్ర వెంకట వీరయ్యను ఐదో నిందితుడిగా పేర్కొంది. మత్తయ్యపై కేసును హైకోర్టు కొట్టివేయగా, ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించించింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన ఓటుకు నోటు కేసులో అరెస్టయిన సండ్ర.. అనంతరం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications